గత విగ్రహాల్లో రాచరిక పోకడలు
ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): గతంలో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో రాచరికపోకడలుండేవని, తాము రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో సగటు తల్లుల వేషధారణ ఉందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలు రూపొందించిన విగ్రహాలు తప్పితే ప్రభుత్వం అధికారికంగా ఇప్పటి వరకు విగ్రహాలను ఏర్పాటు చేయలేదన్నారు.
విగ్రహంలోని రంగులను పార్టీ రంగులుగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. విగ్రహాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ఎన్టీఆర్ హయాంలో హుస్సేన్సాగర్లో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహంలోనూ అభయహస్తం ఉందని గుర్తు చేశారు.
విగ్రహంలోని ఎరుపు రౌద్రం, పోరాటానికి, పసుపు రంగు పచ్చని పంటలకు ప్రతీక అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణ పాటను, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.






