బడి బస్సులపై ఆర్టీఏ నజర్
- వారం రోజుల్లో 418 బస్సులు సీజ్
- రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకుపైగా బస్సుల తనిఖీ
- 510 కేసులు నమోదు చేసిన రవాణా శాఖ
- పెద్దగా పట్టించుకోని స్కూల్ యాజమాన్యాలు
హైదరాబాద్, జూన్ 2౩ (విజయక్రాంతి): పాఠశాలల పునఃప్రారంభం అనగానే అందరికీ బడి బస్సులు గుర్తుకొస్తాయి. ఈ నెల 12న రాష్ట్రంలో పాఠశాలలన్నీ ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుంచే రవాణా శాఖ అధికారులు బడి బస్సుల తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 23,824 బడి బస్సులు ఉంటే ఆదివారం వరకు అధికారులు 20 వేలకుపైగా బస్సుల ఫిట్నెస్ను పరిశీలించారు. 510 కేసులు నమోదు చేశా రు. 418 బస్సులను సీజ్చేశారు. 3,824 బస్సులను తనిఖీ చేయాల్సి ఉంది.
ఆర్టీఏ తనిఖీలు నామ్కే వాస్తే..
బడి బస్సుల తనిఖీలు ప్రహసనంగా మారాయనే విమర్శలున్నాయి. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో సామర్థ్యం లేని బస్సులను తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. బస్సుల యజమానులు కొన్ని పేపర్ వర్క్స్ చేయగానే తిరిగి అవే బస్సులు రోడ్లెక్కుతున్నాయి. ఆర్టీఏ అధికారులు సైతం బస్సుల సామర్థ్యాన్ని నిర్ధారించడంలో నిబంధనలను తూచా తప్పకుండా పాటించడంలేదని పలువురు అంటున్నారు. డొక్కు బస్సులు, కాలం చెల్లిన బస్సులకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు మాత్ర మే పాఠశాలల బస్సులు నడపాల్సి ఉన్నా.. చాలా చోట్ల తక్కువ వేతనానికి వస్తున్నారనే ఉద్దేశంతో అనుభవం లేని డ్రైవర్లను తీసుకుంటున్నారు. స్కూల్ బస్సుల వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రభు త్వం స్పష్టమైన విధివిధానాలను రూపొందించినా, అమలుకు నోచుకోవడం లేదు.
సుశిక్షితుడైన డ్రైవర్ ఉండాల్సిందే..
చిన్నారుల భద్రత బస్సు డ్రైవర్ చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఆ డ్రైవర్కు ఖచ్చి తమైన నిబంధనలుంటాయి. డ్రైవర్ వయ సు 60 ఏళ్లకు మిం చకూడదు. డ్రైవర్లకు 3 నెలలకోసారి రక్తపోటు, షుగరు, కంటి చూపు వంటి ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ప్రతి బస్సులో డ్రైవర్తోపాటు ఒక ఆటెండర్ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవర్కు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. యూనిఫాం ధరించాలి. బస్సులు పసుపు రంగులో ఉండాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్కు స్పష్టంగా కనిపించేలా అద్దాలుండాలి. ఒక అగ్ని మాపక యంత్రం, అత్యవసర ద్వారాం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి. సీటింగ్ కంటే ఎక్కువ మందిని తీసుకెళ్లకూడదు.






