ఆరో తరగతి విద్యార్థికి ఆర్టీసీ ఉద్యోగం!
- అదే సాకు చూపి రేషన్ కార్డు తిరస్కరణ
- నాగర్కర్నూల్- జిల్లా అధికారుల నిర్వాకం
నాగర్కర్నూల్, మార్చి 28 (విజయక్రాంతి): ఆరో తరగతి విద్యార్థికి ఆర్టీసీ ఉద్యోగం ఉందంటూ మధ్యతరగతికి చెందిన ఓ కుటుంబ రేషన్ కార్డును రద్దు చేశారు. ఇది నాగర్కర్నూల్ జిల్లా అధికారుల నిర్లక్ష్యాన్ని చూపుతున్నది. అచ్చంపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్రతి నెలలాగే రేషన్ తీసుకునేందుకు దుకాణానికి వెళ్లగా, తన రేషన్ కార్డు రద్దు అయినట్లు తెలిసింది. విచారణ చేయగా,
వారి కుటుంబంలో ఆర్టీసీ ఉద్యోగి ఉన్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసి కార్డును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ ఉద్యోగిగా చూపించిన వ్యక్తి వారి ఇంట్లో చదువుతున్న ఆరవ తరగతి బాలిక. దీంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆ బాలిక అచ్చంపేట పట్టణంలోని పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. డేటా నమోదు లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తప్పు జరింగిందని ఆరోపిస్తున్నారు.




