02-05-2025 12:00:00 AM
సమాచార హక్కు సాధన స్రవంతి ప్రభుత్వానికి డిమాండ్
ఖైరతాబాద్; మే 1 (విజయ క్రాంతి) : రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియను ఆర్టీఐ చట్టం 2005 నియమ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సమాచార హక్కు చట్టం 2005 (సమాచార హక్కుసాధన స్రవంతి) రాష్ట్ర ప్రధానకార్యదర్శి దేవులపల్లి కార్తీక్ రాజు రాష్ట్ర ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామక ప్రక్రియ సెలక్షన్ కమిటీ సమావేశం గత ఏప్రిల్ 5న జరిగిందన్నారు. పూర్తిస్థాయి సెలక్షన్ కమిటీ లేకుండానే సమావేశం కొనసాగిందని తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు మార్గదర్శకా లకు వ్యతిరేకంగా అనర్హులను ఆర్టిఐ కమిషనర్లుగా ఎంపిక చేశారని తెలిపారు.
స్క్రీనింగ్ కమిటీ సూచించిన షార్ట్ లిస్టు ప్రకారం కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ఆర్టీఐ కమిషనర్లుగా నియమించారని పలు పత్రికలలో వచ్చిన కథనాల ద్వారా తెలుస్తుందని అన్నారు. దీని పై గవర్నర్ ను కలిసి షార్ట్ లిస్టును పునఃపరిశీలించాలని కోరేమని తెలిపారు. ఈ సమావేశంలో సాధన స్రవంతి ప్రతినిధులు శ్రీనాధ్, పృథ్వి పాల్గొన్నారు.