రూపాయి విలవిల
- కనిష్టానికి పతనం!
డాలర్తో పోలిస్తే రూ.92.24 వద్దకు చేరిన కరెన్సీ
న్యూఢిల్లీ, మార్చి 4 : అంతర్జాతీ య మార్కెట్లో అమెరికా డాలర్ బలం పుంజుకోవడంతో రూపాయి విలువ బుధవారం ఘోరంగా పడిపోయింది. మునుపెన్నడూ లేనివిధంగా రూపా యి విలువ డాలర్తో పోలిస్తే రూ. 92. 24 వద్దకు చేరి, ట్రేడర్లను ఆందోళనకు గురిచేసింది. ఉదయం నుంచి ఒత్తిడికి లోనైన కరెన్సీ మార్కెట్లో రూపాయి ఒక్కసారిగా 92 మార్కును దాటి కిందకు జారిపోవడంతో ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండటమే రూపాయి పతనానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో బ్యారెల్ ధర పెరుగుతుండటం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు పెనుశాపంగా మారింది.
భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరల వల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా వెచ్చించాల్సి వస్తోంది. చమురు కొనుగోళ్ల కోసం డాలర్కు డిమాండ్ విపరీతంగా పెరగడం రూపాయిని మరింత బలహీనపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల వల్ల ఇన్వెస్టర్లు డోలాయమానస్థితిలో సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లుతున్నారు.
అమెరికా బాండ్లు, డాలర్ వైపు పెట్టుబడులు తరలిపోవడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతుండటం దేశీయ కరెన్సీపై ప్రభావాన్ని చూపుతోంది.




