calender_icon.png 5 June, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాకాలంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి

03-06-2025 10:45:53 PM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్..

నిర్మల్ (విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజారోగ్య పరిరక్షణలో నిమగ్నమైన ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని, బాధ్యతల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ప్రాధాన్యత గల ప్రాంతాల్లో డ్రెయిన్‌లు పూర్తిగా శుభ్రపరచాలని, నీటి నిల్వలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శానిటేషన్ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని, పని ప్రమాణానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మలేరియా దోమల నియంత్రణకు ఆయిల్ బాల్స్ స్ప్రే చేయాలనీ ఆదేశించారు.గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రజల్లో శుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే పాఠశాలలు, హాస్టళ్లు, ఆంగన్‌వాడీ కేంద్రాల పునః ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు, బడి బాట కార్యక్రమం, చిన్న మరమ్మత్తులు, యూనిఫాం కుట్టింపు, పాఠ్యపుస్తకాల పంపిణీ వంటి అంశాలపై మండలాల వారీగా చర్చించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కల నాటేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు అదనపు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సిఈ ఓ గోవింద్, పి డి డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, డి ఈ ఓ రామారావు, సంక్షేమ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.