08-06-2025 12:13:10 AM
నిర్మల్, జూన్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకులాల్లో సంస్కృత సబ్జెక్టు బోధ నను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ విద్యా సం వత్సరం నుంచి సంస్కృత సబ్జెక్టుకు బదులు గా తెలుగు సబ్జెక్టును బోధించాలని గురుకులాల కార్యదర్శి రమణ కుమార్ రెండు రోజు ల క్రితం రాష్ట్రంలోని అన్ని గురుకులాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
ఈ విద్యా సంవత్స రం నుంచి ఐదు నుంచి తొమ్మి దో తరగతి వరకు సంస్కృత సబ్జెక్టును బోధించవద్దని, సంస్కృత భాష పండితులకు తెలుగు బోధన చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు ఉపాధ్యాయులు తెలి పారు. పది, ఇంటర్ విద్యార్థులకు మాత్రం సంస్కృతం యథావిధిగా ఉంచాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణలో మొత్తం 35 జనరల్ గురుకులాలు ఉండగా ఇంటర్ వరకు ఉన్న ఒక్కో గురుకులంలో సుమారు 640 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత పాఠశాల వరకు ఉన్న ఒక్కో గురుకులంలో 480 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది విద్యార్థులు సంస్కృత సబ్జెక్టును ఎంచుకుంటున్నారు.
ఈ కారణంగా పది, ఇంటర్లో ప్రస్తుతం సంస్కృతం బదులు తెలుగు సబ్జెక్టు బోధన మార్పిడితో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మొదటగా ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు అమలు చేసి, ఆ తర్వాత ఇంటర్ వరకు అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 35 గురుకులాలు ఉండగా 24 గురుకులాల్లో సంస్కృత భాషా పండితులు విధులు నిర్వర్తిస్తున్నారు.
సంస్కృత సబ్జెక్టు పండితులకు నష్టం..
గురుకులాల్లో విద్యార్థులకు సంస్కృత సబ్జెక్టుకు బదులుగా తెలుగు బోధించాలని ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సంస్కృత పండితులతోపాటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సంస్కృత భాషలో విద్యను అభ్యసించి, పీజీలు, డిగ్రీలు చేసి సంస్కృత భాష బోధిస్తున్న పండితులు.. ఇప్పుడు తెలు గు బోధించాలని ఆదేశించడంతో నష్టపోయే అవకాశం ఉంది.
తెలుగు బోధన విషయంలో తమకు ఇబ్బందులు ఏర్పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలం గా గురుకులాల్లో సంస్కృత సబ్జెక్టును అమలు చేసిన ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రద్దు చేయడంపై విమర్శలొస్తున్నాయి. సంస్కృతాన్ని నేర్చుకొని కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ప్రభుత్వ నిర్ణయం ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
ప్రభుత్వం దృష్టికి సమస్య
గురుకులాల్లో సంస్కృత భాషా బోధన నిలిపివేతపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతూ ప్రత్యేక కార్యచరణతో ముందుకు పోతున్నట్టు సంస్కృత భాషా పండితులు తెలిపారు. ఇప్పటికే వారంతా హైదరాబాద్ వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రస్తు తం గురుకులాల్లో సంస్కృతాన్ని నిలిపివేసి న ప్రభుత్వం భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు, వివిధ గ్రూపులలో కూడా ఇటు వంటి నిర్ణయాలే తీసుకుంటే తమ పరిస్థితి ఏం కావాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నట్టు సమాచారం.