వైద్యం వికటించి సర్పంచ్ మృతి!
- భద్రాచలం మిమ్స్ హాస్పటల్లో ఘటన
- వైద్యుల నిర్లక్ష్యమే కారణం?
- మృతదేహాన్ని హాస్పిటల్ ముందు ఉంచి బంధువులు ఆందోళన
భద్రాచలం, జూలై 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో గల మిమ్స్ హాస్పటల్లో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక మహిళా సర్పంచ్ మృతి చెందిందని.. అర్ధరాత్రి మృతదేహాన్ని హాస్పిటల్ ముందు ఉంచి బంధువులు ఆందోళన చేపట్టారు. పాల్వంచ మండలం దంతెల బోర గ్రామం ఎస్సీ కాలనీకి సీపీఐ సర్పంచ్ సోడే వెంకటరమణ గతంలో భద్రాచలం మిమ్స్ ఆసుపత్రిలో కాలికి ఆపరేషన్ చేపించుకుంది.
ఇటీవల కాలికి వాపు రాగ భర్త సహాయంతో భద్రాచలం మిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స చేసి మళ్లీ ఆపరేషన్ చేద్దామని వైద్యులు చెప్పినట్లు సమాచారం. అయితే నిర్లక్ష్యంగా హైడోస్ యాంటీబయోటిక్స్ ఇంజక్షన్లు వేయడంతో సీరియస్ అయిందని, ఇదేమిటని సర్పంచ్ భర్త ప్రశ్నించే లోపే మిమ్స్ ఆస్పత్రి వారు అంబులెన్స్లో హుటా హుటిన ఖమ్మం తరలించారని సమాచారం.
మీమ్స్ ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నా భార్య ప్రాణాలు కోల్పోయిందని.. మా ఇద్దరు పసిపిల్లలు అనాధలుగా మిగిలారని, ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ స ర్పంచ్ భర్త మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియా వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత మృతదేహంతో ధర్నా చేస్తున్న వారిని చెదరగొట్టి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.






