13-08-2025 01:23:02 AM
కరీంనగర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్లో నిర్వహించాల్సిన బీసీ కదన భేరి సభ మళ్లీ వాయిదా పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14, 15, 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో బీసీ కదన భేరి సభను వాయిదా వేస్తున్నామని మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
తొలుత ఈ నెల 8న నిర్వహిస్తున్నట్టు ప్రకటించి 14కు వాయిదా వేశారు. ఇప్పుడు వానలు కురిసే అవకాశముండటంతో మళ్లీ వాయిదా వేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత సభ నిర్వహణకు చర్యలు తీసుకుంటామని గంగుల కమాలకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు గమనించాలని ఆయన కోరారు.