26-11-2025 12:00:00 AM
కీలక రంగాల్లో కలసి పని చేసేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్
‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్(ఫేజ్--2)’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి) : ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. డిజిటల్ కనెక్టివిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, లైఫ్ సెన్సైస్, బయో ఇన్నోవేషన్, రూరల్ గ్రోత్ తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సమగ్ర రోడ్ మ్యాప్ను రూపొందిస్తామని తెలిపారు.
మంగళవారం రాజ్భవన్లో నిర్వహించిన “తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్(ఫేజ్ -2)” ప్రారంభోత్సవంలో ఆయన విశిష్ఠ అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాంతం, రాష్ర్టంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకునే గొప్ప మనస్సు తెలంగాణ ప్రజలది అని వివరించారు. కనెక్టివిటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లాంటి సవాళ్లను సైతం అధిగమించి డిజిటల్ అక్షరాస్యత, ఐటీ స్కిల్లింగ్, ఫిన్ టెక్, డిజిటల్ సర్వీస్లను ఈశాన్య రాష్ట్రాలు అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు.
భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, భావితరాల అవసరాలకు అనుగుణంగా నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ఆ దిశగా రేపటి తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ యూనివర్సిటీ, ఏఐ సిటీ, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్, ఏఐ ఇంటిగ్రేటెడ్ అకడమిక్ కరిక్యులం... కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో తెలంగాణను గ్లోబల్ హబ్ గా మార్చుతాయన్నారు.
లైఫ్ సెన్సైస్ రంగంలో స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు టీ హబ్ తరహాలోనే ‘వన్ బయో’ పేరిట ప్రత్యేక ఇంక్యుబేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 2047 నాటికి ‘భారత్’ సూపర్ పవర్గా మారాలంటే దేశంలోని ప్రతి ప్రాంతం ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
కలిసి ఎదగాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నార్త్ ఈస్ట్ తెలంగాణ టెక్ కారిడార్, జాయింట్ ఇన్నోవేషన్ ల్యాబ్స్, బయో ఇంక్యూబేటర్స్ క్రియేటివ్ టెక్ స్టూడియోలు, గ్రీన్ ఎనర్జీ కొలాబరేషన్స్ తదితర అంశాల్లో ఈశాన్య రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామన్నారు.