23-04-2025 01:47:10 AM
టాప్టెన్ ర్యాంకర్లు వీరే..
1 శక్తి దూబే
2 హర్షిత గోయల్
3 ఆర్చిత్ పరాగ్
4 షా మార్గి
5 ఆకాశ్ గార్గ్
6 కోమల్ పూనియా
7 ఆయుషీ బన్సల్
8 రాజ్కృష్ణ ఝూ
9 ఆదిత్య విక్రమ్ అగర్వాల్
10 మయాంక్ త్రిపాఠి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2024 తుది ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సహా టాప్-5 ర్యాంకుల్లో ముగ్గురు, టాప్-25 ర్యాంకుల్లో 11 మంది మహిళా అభ్యర్థులే ఉన్నారు.
మొత్తం 1009 మందిని ప్రతిష్ఠాత్మక ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ, గ్రూప్-బీ సర్వీసులకు ఎంపిక చేసింది. వీరిలో దాదాపు ౩౫ మంది తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు కనబరిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇట్టబోయిన సాయిశివాని 11వ ర్యాంకు సాధించారు.
రెండు రాష్ట్రాల నుంచి మెరుగైన ర్యాంకు సాయిశివానిదే. ఆమె తర్వాత బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు సాధించగా, అభిషేక్ శర్మకు 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డికి 46వ ర్యాంకు, శ్రవణ్కుమార్రెడ్డికి 62, సాయిచైతన్యజాదవ్కు 68, ఎన్ చేతనరెడ్డికి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేశ్రెడ్డికి 119వ ర్యాంకు వచ్చాయి.
చల్లా పవన్ కల్యాణ్కు 146, ఎన్ శ్రీకాంత్రెడ్డికి 151, నెల్లూరు సాయితేజకు 154, కొలిపాక శ్రీకృష్ణసాయికు 190వ ర్యాంకు వచ్చింది. ఎం పవన్కుమార్రెడ్డి-375, జీ సూర్యతేజ-647, ఎస్ సాయిభార్గవ-798, తొగరు సూర్యతేజ- 799, రవడ సాయి మోహిని మానస-975 ర్యాంకులు సాధించారు. వీరితోపాటు మరికొంత మంది ర్యాంకులు సాధించారు.
టాప్ ఒక్కరు కూడా లేరు..
అయితే ఈసారి టాప్-10 జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఒక్కరు కూడా లేరు. వంద లోపు ర్యాంకుల్లో ఆరుగురే ఉన్నట్లు సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ, బీ పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది.
జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిం చగా, అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్లో సత్తాచాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిం చి తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు.
మొత్తం 1,009 మందిని యూపీఎస్సీ ఎంపి క చేయగా జనరల్ క్యాటగిరిలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ క్యాటగిరిలో 160 మంది, ఎస్టీ క్యాటగిరి నుంచి 87 మంది చొప్పున ఎంపికయ్యారు. అలాగే సివిల్ సర్వీసెస్ నిబంధనలను అనుసరించి 230 మందిని రిజర్వు జాబితాలో యూపీఎస్సీ ఉంచింది.
2018 నుంచి ప్రిపరేషన్లోనే..
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకు సాధించిన శక్తి దూబేది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్. శక్తి దూబే తండ్రి దేవేం ద్ర కుమార్ దూబే పోలీసు దళంలో పనిచేస్తున్నారు. తల్లి గృహిణి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శక్తి దూబే పాఠశాల విద్య అనంతరం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వారణాసికి మారారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరారు. అనంతరం అలహాబాద్ యునివర్సిటీలో బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న శక్తి దూబే సివిల్స్ పరీక్షలో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ను ఐచ్చిక సబ్జెక్టుగా తీసుకున్నారు.
ఓరుగల్లుతేజం సాయిశివాని
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్స్ ఫలితాల్లో ఓరుగల్లు తేజం సాయిశివాని మెరి శారు. జాతీయస్థాయిలో 11వ ర్యాంకు సాధించి ఓరుగల్లు పేరును జాతీయస్థాయి లో నిలిపారు. వరంగల్ నగరానికి చెందిన ఇట్టబోయిన రాజకుమార్, రజిత దంపతుల కుమార్తె సాయిశివాని చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ చూపారు.
కుమార్తెకు చదువుపై ఉన్న మమకారాన్ని పెంపొందించే విధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించడంతో సివిల్స్ వరకు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడకుండా చదువుల్లో రాణించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిశివాని పట్టుదలతో చదివి సివిల్స్ లో జాతీయస్థాయిలో ర్యాంక్ సాధించడంపై వరంగల్ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
తండ్రి రాజ్కుమార్ మెడికల్ రిప్రజెంటివ్గా పనిచేస్తూ తన ముగ్గురు పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడ్డారు. సాయిశివాని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాజాగా సివిల్స్ లో జాతీయస్థాయి 11వ ర్యాంకు సాధించడంతో ఐఏఎస్ క్యాడర్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సాయిశివాని ఆంధ్రప్రదేశ్లోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2022 నుంచి సొంతంగా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. 2023లో నిర్వహించిన సివిల్స్ పరీక్షలకు హాజరు కాగా రెండోసారి ఏకంగా జాతీయస్థాయిలో ర్యాంకు సాధించి ఐఏఎస్ ఉద్యోగాన్ని అందిపుచ్చుకున్నారు.
మెరిసిన సాయిచైతన్య నాయక్
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడు సివిల్స్లో సత్తా చాటారు. తలమడుగు మండలం పల్సితండాకు చెందిన జాదవ్ సాయి చైతన్య నాయక్ సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి గోవింద్రావు ఉట్నూర్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. సాయి చైతన్య నాయక్ మెరుగైన ర్యాంకు సాధించడంతో జిల్లావాసులు అభినందనలు తెలిపారు. మొదటి నుంచి సివిల్స్ లక్ష్యంగా చదివి ర్యాంకు సాధించానని జాదవ్ సాయి చైతన్య నాయక్ ఈ సందర్భంగా తెలిపారు.
గురుకులాల్లో చదివి..
కుమ్రంభీం ఆసిఫాబాద్: కుమ్రంభీం జిల్లా కౌటాల మండలం బోదంపల్లి గ్రామంలోని రాంటెంకీ సోమయ్య,- ప్రమీల దంపతుల కుమారుడు సుధాకర్ 949 ర్యాంక్ సాధించారు. సిర్పూర్ టీ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు చదివారు. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని గురుకులంలో ఇంటర్, ఖరగ్పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. 2018 సంవత్సరం నుంచి సివిల్స్కు సన్నద్ధం అయ్యారు.