షీ టీమ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
చివ్వెంల, జూలై 8 : మండలంలోని కుడకుడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో షీ టీమ్స్, సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీం మహిళా ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ విద్యార్థులు ఇంటర్నెట్ను బాధ్యతాయు తంగా వినియోగించాలని, ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద బ్లూ లింకులను క్లిక్ చేయొద్దని,
సైబర్ మోసాలకు 1930, అత్యవసర సేవలకు 112కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళలు, బాలికలపై వేధింపులు జరిగితే షీ టీంకు సమాచారం అందించాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.అనంతరం పోలీసు కళాబృందం పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రమణ, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, కళాబృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.






