ష్.. మాటల్లేవ్! ఓ రేంజ్ హిట్టింగ్
హైదరాబాద్ పాంచ్ పటాకా
వామ్మో.. ఓరినాయానో.. ఏందా కొట్టుడు!
చూస్తున్నది లైవ్ మ్యాచా లేక
హైలైట్సా అన్న సందేహం వచ్చేలా!
బౌలింగ్ చేస్తున్నది అంతర్జాతీయ స్థాయి బౌలర్లా..
గల్లి పోరగాళ్లా అనే అనుమానం రేకెత్తేలా!
సన్రైజర్స్ సునామీ సృష్టించింది. బౌలర్ చేతి నుంచి బంతి రావడమే తరువాయి దాని మీద ఆకలిగొన్న సింహాల్లా విరుచుకుపడిన హైదరాబాద్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు!! తొలి ఓవర్ రెండో బంతికి ప్రారంభమైన దంచుడు.. చివరి వరకు అదే స్థాయిలో కొనసాగింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంతులు వేసుకొని మరి సిక్సర్లు బాదితే.. ఆఖర్లో నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ అగ్నికి ఆజ్యం పోశారు.
n హెడ్, అభిషేక్ విధ్వంసం
n ఢిల్లీపై 67 పరుగులతో విక్టరీ
n మెక్గుర్క్ పోరాటం వృథా
వాస్తవానికి వీరవిహారం, ఊచకోత, శివతాండవం వంటి విశేషణాలే
అచ్చరువొందేలా రైజర్స్ బ్యాటర్లు రఫ్ఫాడించారు. ముఖ్యంగా పవర్ప్లేలో మనవాళ్ల అరాచకానికి రికార్డులు సలాం కొట్టగా.. కమిన్స్ సేన
విన్యాసాలకు అభిమానులు గులాం అయిపోయారు. టాస్ గెలిచి
ప్రత్యర్థికి బ్యాటింగ్ ఎందుకు అప్పగించానా అని పంత్ తలపట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొనగా.. క్రీజులోకి వచ్చిన ప్రతి ఆటగాడు శివాలెత్తినట్లు సిక్సర్లతో రెచ్చిపోయారు. ఛేదనలో ఢిల్లీ కూడా
గట్టిగానే ప్రయత్నించినా.. రికార్డు లక్ష్యానికి చాలా దూరంలో
నిలిచిపోయింది. కొండంత చేజింగ్లో ఢిల్లీ బ్యాటర్లు
మెక్గుర్క్, అభిషేక్ పొరెల్ ఆకట్టుకున్నారు.
ఢిల్లీ: బాదుడే పరమావధిగా సాగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్లో మరో విధ్వంస కాండ రచించింది. బంతి రావడమే తరువాయి దానిపై ఏళ్ల నాటి పగ ఉన్నట్లు విరుచుకుపడిన హైదరాబాద్ బ్యాటర్లు.. సీజన్లో ముచ్చటగా మూడోసారి 250 మార్క్ దాటారు. శనివారం ఈడెన్ గార్డెన్స్లో పరుగుల వరద పారిన పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (32 బంతుల్లో 89; 11 ఫోర్లు, 6 సిక్సర్లు), అభిషేక్ శర్మ (12 బంతుల్లో 46; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) టీమ్కు రాకెట్ ఆరంభాన్నివ్వగా.. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (29 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. మెక్గుర్క్ (18 బంతుల్లో 65; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), అభిషేక్ పొరెల్ (22 బంతుల్లో 42; 7 ఫోర్లు, ఒక సిక్సర్), కెప్టెన్ రిషబ్ పంత్ (35 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 4, మయాంక్ మార్కండే, నితీశ్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఆ ఆరు ఓవర్లు..
రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్న సన్రైజర్స్.. ఈ సీజన్లో మ్యాచ్కో నయా ఘనత తమ పేరిట లిఖించుకుంటోంది. తాజా సీజన్లో ఒకటికి రెండు సార్లు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టిన రైజర్స్.. ఈ మ్యాచ్లో పవర్ప్లేలో పరుగుల సునామీ సృష్టించింది. టీ20ల చరిత్రలో మరేజట్టుకు సాధ్యంకాని రీతిలో ఆరు ఓవర్లలో 125 పరుగులు సాధించి ఔరా అనిపించింది. హెడ్, అభిషేక్ ఒకరిని మించి ఒకరు విధ్వంసం సృష్టించగా.. ఢిల్లీ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో 0,6,4,4,1,4 పరుగులు రాగా.. రెండో ఓవర్లో ఈ జంట 6,6,0,4,1,4 రన్స్ రాబట్టింది. మూడో ఓవర్లో 4,4,0,4,4,6 బాదిన హెడ్ 16 బంతుల్లో హాఫ్సెంచరీ నమోదు చేసుకున్నాడు. నాలుగో ఓవర్లో ఇద్దరు కలిసి మూడు సిక్సర్లు కొట్టగా.. ఐదో ఓవర్లో అభిషేక్ ఒక్కడే మూడు సిక్సర్లు అరుసుకోవడంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటగా.. ఆరో ఓవర్లో హెడ్ 4,4,4,4,0,6 బాదాడు. దీంతో పవర్ ప్లే
> ముగిసేసరికి రైజర్స్ 125/0తో నయా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో కాస్త వెనుకబడ్డ హైదరాబాద్ ఆఖరికి భారీ స్కోరుతోనే ఇన్నింగ్స్ను ముగించింది.
> ఐపీఎల్ చరిత్రలో పవర్ప్లేలో అత్యధిక పరుగులు (125) చేసిన జట్టుగా హైదరాబాద్ చరిత్రకెక్కింది. బెంగళూరుపై కోల్కతా చేసిన 105 పరుగుల రికార్డు రెండో స్థానానికి చేరింది.
> అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన జట్టుగానూ హైదరాబాద్ రికార్డుల్లోకెక్కింది.
> తాజా పోరులో రైజర్స్ 5 ఓవర్లలోనే ఈ మార్క్ దాటింది.
ఐపీఎల్లో 250 మార్క్ను మూడుసార్లు చేరుకున్న ఏకైక జట్టుగా సన్రైజర్స్ నిలిచింది.
ఆ మూడూ ఈ సీజన్
లోనే నమోదు కావడం మరో విశేషం.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 266/7 (హెడ్ 89, షాబాజ్ 59; కుల్దీప్ 4/55), ఢిల్లీ: 19.1 ఓవర్లలో 199 ఆలౌట్ (మెక్గుర్క్ 65, పంత్ 44 నాటౌట్; నటరాజన్ 4/19).
ట్రావిస్ హెడ్
పరుగులు 89
బంతులు 32
ఫోర్లు 11
సిక్సర్లు 6
స్ట్రయిక్రేట్ 278.12






