calender_icon.png 20 October, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండలానికి ఆరుగురు సర్వేయర్లు

18-10-2025 01:40:14 AM

  1. రేపు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్‌లు పంపిణీ 
  2. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి 

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి):  క్షేత్రస్థాయిలో రైతాంగానికి, ప్రజలకు సులభంగా భూసేవలు అందేలా ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 19న శిల్ప కళావేదికలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సర్వేయర్లకు లైసెన్స్‌లను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

భూములకు సంబంధించిన అనేక పంచాయితీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వేయర్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్‌ను జత పరచడం తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలకం కానుందన్నారు.

భూ భారతి చట్టంలో పేర్కొన్న విధం గా ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రస్తుతం ఉన్న 350 మంది సర్వేయర్లు సరిపోరని, మరి కొంత మంది సర్వేయర్లు అవసరమవుతా రన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఒక వైపు లైసెన్స్డ్ సర్వేయర్లను తీసుకోవడం, మరోవైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులు భర్తీ చేయడం, ఇంకో వైపు భూముల సర్వేకు అవసరమైన అత్యాధునికి పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్, సర్వే విభాగం కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో కలిసి సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సూచన మేరకు అవసరమైన సర్వేయర్లను అందుబాటులోకి తీసుకురావడానికి దరఖాస్తులను ఆహ్వానించగా 10 వేల మంది దరఖాస్తు చేసుకోగా తొలివిడతలో 7 వేల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఇందులో 3,465 మంది అర్హత సాధించారని తెలిపారు.

రెండో విడతలో మరో 3 వేల మందికి ఆగస్టు 18 నుంచి శిక్షణను ప్రారంభించామని ఈ నెల 26వ తేదీన జేఎన్టీయూ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హత సాధించిన వారికి 40 రోజుల పాటు అప్రంటిస్ శిక్షణ ఉంటుందని, వారి సేవలు కూడా డిసెంబర్ రెండో వారం నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. భూమి రికార్డులు స్పష్టంగా ఉండేలా, ప్రజలకు ఇబ్బంది లేకుం డా, అవినీతి లేని సేవలు అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.