05-09-2025 01:25:31 AM
పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టాలి
అవసరమైన నిర్ణయాలకు 15న క్యాబినెట్
2027, డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలకు అంకితం
ఎస్ఎల్బీసీ పునరుద్ధరణపై సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధర ణ వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించా రు. ఒక్కరోజు కూడా ఆలస్యమయ్యేందుకు వీలులేదని స్పష్టంచేశారు. ఈ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్లగొండ జిల్లాకే కాకుండా తెలంగాణకు అత్యంత కీలకమని, అందుకే ప్రణాళిక ప్రకారం అత్యంత నైపుణ్యంతో ఈ పనులు చేపట్టాలని సూచించారు. ప్రపంచస్థాయి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు.
గతంలో జరిగిన తప్పులు, లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా, అత్యంత భద్రంగా రక్షణ చర్యలు చేపట్టి, ముందుకు సాగాలని చెప్పారు. అనుభవమున్న ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సర్వేతో పాటు పనులు పూర్తయే వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన అన్ని ఏజెన్సీల సలహాలు సూచనలతో యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగించాలని అదేశించారు.
గురువారం తన నివా సంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితో కలిసి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రా హుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారులు ఆదిత్యానాథ్ దాస్, ఇండియన్ ఆర్మీ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, స్పెషల్ సెక్రటరీ, ఇండియన్ ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, ఈఎన్సీలు అంజత్ హు స్సేన్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్, చీఫ్ సైంటిస్ట్ హెచ్వీఎస్ సత్యనారాయణ, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేవీ మా రుతి, డైరెక్టర్ శైలేంద్ర కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్టులకు ఆదర్శంగా ఉండేలా ఎస్ఎల్బీసీ నిర్మాణం పూర్తి చేయాలని, ఇదొక కేస్ స్టడీగా ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని భరోసానిచ్చారు. వెంటనే అటవీ శాఖ, ఇంధన శాఖ ఇరిగేషన్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15న క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. వెంటనే సంబంధిత విభాగాల అధికారులస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
ఒక్క సమావేశంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించారు. అటవీశాఖ అనుమ తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఎస్ఎల్బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలని, సొరంగం తొవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రజలకు అంకితం..
ఎస్ఎల్బీసీ ఏళ్లకేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న కలల ప్రాజెక్ట్ అని, ఎలాంటి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్బీసీలో అవకాశముందని సీఎం అన్నారు. 2027, డిసెంబర్ 9న తెలంగాణ ప్రజలకు అంకితం చేయాలని సీఎం గడువు నిర్ణయించారు. గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్లానింగ్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని, కాంట్రాక్ట్ సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదని సీఎం ఆదేశించారు. ఇన్లెట్ వైపు నుంచి ఔట్లెట్ వైపు.. రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలని, అందుకు అవసరమైన యంత్ర పరికరాలతో పాటు సరిపడేంత మంది నిపుణులు, కార్మికులను రంగంలోకి దింపాలని సూచించారు.
ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ చానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తం 44 కి.మీ. సొరంగమార్గానికిగానూ ఇప్పటికే 35 కి.మీ. సొరంగం తవ్వడం పూర్తయ్యిందని, మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గానూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నట్టు ఈ సందర్భంగా పరీక్షిత్ మోహ్ర వివరించారు.
ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని, 2028, జనవరి నాటికి పూర్తి చేయనున్నట్టు తెలిపారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు.