20-06-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు సోషల్ మీడియాపై సైబర్ సెక్యూరిటీ పూర్తిస్థాయి నిఘా ఉంటుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ క్రమం లోనే గురువారం ప్రత్యేక ఆపరేషన్లో 15మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
క్రైమ్ పోలీస్తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్లోడ్ చేసి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ 15 మంది నిందితులకు మరో 34 కేసుల్లో కూడా సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామాన్నారు.
వీరి వయస్సు 19 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, వీరిలో కొంతమంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారని శిఖా గోయల్ పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో సోషల్ మీడియా కార్యకలాపాలపై సైబర్ సెక్యూరిటీ పూర్తి దృష్టి పెడుతుందని హెచ్చరించారు.