18-10-2025 06:55:21 PM
వాటా కోసం పిడికిలెత్తిన సకల జనులు
రిజర్వేషన్ కోసం గొంతెత్తిన సామాజిక సంస్థలు, ఓబీసీ నేతలు
చీమల దండులా కదిలిన విద్యార్థులు
పోలీసు బందోబస్తు మధ్య ‘బీసీ ఉద్యమ కవాతు’
తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని ఆవిష్కరించిన రిజర్వేషన్ పోరు
డిపోలకే పరిమితమైన ప్రగతి రథ చక్రాలు
సచ్ఛంద బంద్ తో వ్యాపార, వాణిజ్య సంస్థల మూత
హనుమకొండ (విజయక్రాంతి): మేమెంతో మాకంత అనే నినాదంతో 42% రిజర్వేషన్ వాటా, కోటా బరాబర్ తమదేనంటూ ఓబీసీ చైర్మన్, మాజీ కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ నేత్రుత్వంలో హనుమకొండలో సామాజిక సంస్థలు, సబ్బండ కులాలు, విద్యార్థులు, మేథావులు ఓరుగల్లు వీధుల్లో కదం తొక్కారు. బహుజన జెండాలు, బీసీ రిజర్వేషన్ నినాదాలతో ఓరుగల్లు ఓక్కసారిగా పిడికిలి బిగించి గొంతెత్తి నినదించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్చందంగా మూసివేసి కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, మేథావి వర్గం అంతా పిడికిలి బిగించి పోరుగల్లు సమరానికి జై కొట్టింది. ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సహా యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, ఆచార్యులు, కుల సంఘాల ప్రతినిధులు, సకల వర్గాలు, సబ్బండ కులాలు హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీగా కదిలారు.
ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ నాడు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు, ఉద్యమకారులు, మేథావులు, బీసీలు తెగించి కొట్లాడారని, నేడు తెచ్చుకున్న తెలంగాణలో జనాభాలో సగం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కావాలని ఉద్యమించాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. దానిలో భాగంగా తొలి దశలో 42 శాతం రిజర్వేషన్ ను స్థానిక సంస్థల్లో సాధించాలని అందుకోసం సబ్బండ వర్గాలు పిడికిలి బిగించి పోరాటం చేయాలని కోరారు. ఈ రోజు తమ కోసం తాము బీసీలు ఉద్యమించాలని, ఇది సకల జనులకు, సబ్బండ కులాలకు ఆత్మగౌరవ పోరాటంగా మారిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎగసి పడ్డ విద్యాసంస్థలు, విద్యార్థులు బీసీ బంద్ సందర్భంగా చీమల దండులా వందలాది మంది కదిలి వచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు. రెండు గంటల పాటు ఎన్పీడిసీ ఎల్ ఆఫీస్, కాళోజీ సెంటర్ మీదుగా అదాలత్ సెంటర్ లోని అమరవీరుల స్పూపం వరకు చేరుకున్నారు. ప్రతీ ఉద్యమకారుడు బీసీ జెండా చేత పట్టుకుని, రిజర్వేషన్ సాధన నినాదాలతో హోరెత్తించారు. రెండు కిలోమీటర్ల మేర కిక్కిరిసిన ర్యాలీలో యువత, డాక్టర్లు, అడ్వకేట్లు , ఆటో కార్మికులు, మహిళలు, విద్యార్థినిలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఆందోళన కారుల నినాదాలు, బీసీ రిజర్వేషన్ ఆకాంక్షతో నాటి తెలంగాణ ఉద్యమం కళ్లముందు కదలలాడింది. నాటి ఉద్యమ స్వరూపాన్ని మేథావులు, విద్యార్థులు, ఉద్యమకారులు మరోసారి ఆ స్పూర్తిని ఓరుగల్లు పురవీధుల్లో చాటారు. హైస్కూల్ టు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల నుంచి కదిలి వచ్చారు.
పోలీసు బందోబస్తు మధ్య బీసీ ఉద్యమ కవాతు
పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు, మేథావులు, కార్మికులు, వ్యాపార వర్గాల ఆకాంక్షను ఎలిగెత్తిన భారీ ర్యాలీలో డీజీపీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వందలాదిగా తరలివస్తున్న విద్యార్థుల ర్యాలీ బందోబస్తు కోసం ఏసీపీ సహా ముగ్గులు సీఐలు, పలువురు ఎస్సైలు ర్యాలీని అనుసరించి సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకున్నారు. రెండు గంటల పాటు సాగిన ర్యాలీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్దీకరించడం చాలా రోజుల తర్వాత ఉద్యమ స్వరూపానికి ర్యాలీ నిర్వహణ అద్దం పట్టింది.
డిపోల్లోనే నిలిచిన ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు
బీసీ బంద్ నేపథ్యంలో అప్పటికే వ్యాపార వాణిజ్య సంస్థల బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెల్లవారు జామున 4 గంటలకే ఓబీసీ చైర్మన్ ఎస్.సుందర్ రాజ్ యాదవ్ నేత్రుత్వంలో ఆందోళనకారులు హనుమకొండ బస్ డిపోకు చేరకున్నారు. బీసీ ఉద్యమ సంస్థలు, సామాజిక ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి బస్ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. బీసీ ఉద్యమం బహుజనుల ఆత్మగౌరవ సమస్య కాబట్టి బంద్ ను విజయవంతం చేస్తామనే పట్టుదలతో డిపో ఎదుటనే ఉద్యమకారులు బైఠాయించారు. దీంతో వివిధ ప్రాంతాలకు చేరాల్సిన ఆర్టీసీ బస్సులు తెల్లవారు జాము నుంచి డిపోకు పరిమిత మయ్యాయి.
ఆందోళన నిర్వహిస్తున్న ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు,ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంఘీభావం ప్రకటించారు.బీసీ బంద్ ర్యాలీలో ఓబిసి ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్, ఓబిసి ఉపాధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, ఓబీసీ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్, వేణుమాధవ్ గౌడ్, మౌనిక గౌడ్, రాజేష్ కుమార్, తీగల భరత్ గౌడ్, అఖిలభారత యాదవ మహాసభ అధ్యక్షులు గిరవేన రాజయ్య యాదవ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్, బీసీ ఉద్యమకారులు, విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని కుల సంఘాల నాయకులు, సబ్బండ వర్గాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.