16-09-2025 01:14:33 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి) : రాష్ర్టమంతటా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహిం చే అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉం డాలని స్పష్టంచేశారు.
గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసరమున్నాయో పక్కాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జీహెఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ. 8 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తుందని, విద్యుత్తు ఆదా చేసేందుకు సోలార్ పవర్ వినియోగించే అంశాన్ని, అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
రాష్ర్టంలో అన్ని ఎల్ఈడీ లైట్లను హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలన్నారు. సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
రాత్రి పూట ఎల్ఈడీ లైట్లు పనిచేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ఈడీ డ్యాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీవో పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్ కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు.
రాష్ర్టంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, వరంగల్, నల్లగొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ అధ్వర్యంలో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులకే వీటిని అప్పగిస్తే.. లైట్ల నిర్వహణ, విద్యుత్తు దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది.
కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు..
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 5.50 లక్షల ఎల్ఈడీ లైట్లు ఉన్నాయని, అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ సీఎంకు నివేదించింది. గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియటంతో ఇప్పుడు చాలాచోట్ల లైట్లు వెలగటం లేదని, నిర్వహణ కూడా సరిగా జరగలేదని అధికారులు నివేదించారు.
కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని, కొత్తగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వనించాలని, ఏడేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని, నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు.
ఎల్ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్ల ఏర్పాటు, నిరంతరం అవి పనిచేస్తున్నాయా లేదా, ఏయే ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలన్నారు. హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు.
కోర్ అర్బన్, అవుటర్ బయటి మున్సిపాలిటిల్లో ఎల్ఈడీ లైట్లు
కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు అవుటర్ అవతల ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ర్టంలో కొత్తగా ఏర్ప డ్డ మున్సిపాలిటీలతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో కొత్త గ్రామాల విలీనం, గ్రామాల మార్పులు చేర్పులు జరిగాయని అన్నారు. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఎల్ఈడీ లైట్ల అంచనా వేయాలని సీఎం సూచించారు.
కోర్ అర్బన్ సిటీతో పాటు మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ లైట్లకు కూడా టెండర్లు పిలవాలన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, జీ హెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీజన ఈ సమావేశంలో పాల్గొన్నారు.