కన్న తల్లిని కత్తితో దాడి చేసి చంపిన కసాయి కొడుకు
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. తల్లి రజినికి వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన కొడుకు పక్కాగా ప్లాన్ వేసి ఆ వ్యక్తిని ఇంటికి పిలిపించి మద్యం తాగించాడు. ఆ తర్వాత గొడవ చేసి మరీ ఆ వ్యక్తిని చంపేందుకు యత్నించాడు.దాడిని తల్లి అడ్డుకోబోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకే కన్నతల్లి అని చూడకుండా కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రజినిని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకుతో పాటు మరో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.




