11-06-2025 11:54:27 PM
హనీమూన్ హత్య కేసులో నేరాన్ని అంగీకరించిన సోనమ్..
మృతుడి కుటుంబాన్ని క్షమాపణలు అడిగిన సోనమ్ సోదరుడు..
షిల్లాంగ్: దేశంలో సంచలనం మేఘాలయ హనీమూన్ హత్యాకేసు(Meghalaya honeymoon murder case)లో నిందితురాలు సోనమ్ రఘువంశీ తన నేరాన్ని అంగీకరించింది. తన భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో చెప్పినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో సోనమ్తో పాటు నిందితులను పోలీసులు బుధవారం షిల్లాంగ్కు తీసుకొచ్చారు. అక్కడి సిట్ బృందం వీరిని విచారించగా, సోనమ్ తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో సోనమ్ వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు రికార్డు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈ కేసు దర్యాప్తులను ఆమె వాంగ్మూలం కీలకం కానుంది.
తనను ఉరితీయాలి: సోనమ్ సోదరుడు
మేఘాలయ హనీమూన్ హత్యాకేసుపై సోనమ్ సోదరుడు గోవింద్ మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పటివరకు ఉన్న ఆధారాలు చూస్తుటే.. సోనమే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఉన్న నిందితులందరూ రాజ్ కుశ్వాహాకు తెలిసినవాళ్లే. ఈ వార్త తెలిసి తర్వాత మేం సోనమ్తో సంబంధాలు తెంచుకున్నాం. రాజా రఘువంశీ కుటుంబానికి క్షమాపణలు కోరుతున్నా. ఈ కేసులో సోనమ్ దోషిగా తేలితే, ఆమెను ఉరితీయాలి’ అని గోవింద్ పేర్కొన్నారు.