రెండు రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
- రూ. 6,405 కోట్ల అంచనాతో పనులు
- నిర్ణయం తీసుకున్న ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ
- మంగుళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానించేందుకు మార్గం సుగమం
న్యూఢిల్లీ, జూన్ 11: ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని రెండు రైల్వే ప్రాజెక్టుల డబ్లింగ్ పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు.
6,405 కోట్లతో..
దేశవ్యాప్తంగా రూ. 6,405 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు ప్రాజెక్టుల డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. జార్ఖండ్లోని కోడెర్మా (133 కి.మీ), కర్ణాటకలోని బళ్లారి (185 కి.మీ) ఉన్నాయి. మొదటి ప్రాజెక్టు ఉన్న ప్రాంతంలో జార్ఖండ్లోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతాలు ఉన్నాయి. ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే పాట్నా నడుమ అత్యంత సమర్థవంతమైన రైలు కనెక్టివిటీ అందనుంది.
ఇక కర్ణాటకలోని బళ్లారి రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు కూడా ఉపయోగం ఉండనుంది. బళ్లారి రైల్వే లైన్ అనంతపురం గుండా వెళ్తుంది. ఈ నిర్ణయంతో మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానం చేసేందుకు మార్గం సుగమం అవనుంది. ఈ డబ్లింగ్ పనులకు రూ. 3,342 కోట్లు అవుతాయని అంచనా వేశారు.
రవాణా ఖర్చులు తగ్గించింది..
మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక రవాణా, లాజిస్టిక్ ఖర్చులను తగ్గించేందుకు అనేక ప్రాజెక్టులు చేపట్టింది. గతేడాది రవాణా ప్రాజెక్టుల కోసం సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించబడ్డాయని మంత్రి వెల్లడించారు.






