సోఫియా.. ఒడిశా తొలి ముస్లిం ఎమ్మెల్యే
భువనేశ్వర్, జూన్ 8: ఒడిశాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బారాబాటి కటక్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన సోఫియా ఫిర్దౌస్.. ఒడిశా అసెంబ్లీలో అడుగు పెడుతున్న మొట్టమొదటి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె బీజేపీ అభ్యర్థి పూర్ణచంద్ర మహాపాత్రను 8001 ఓట్ల తేడాతో ఓడించారు. సోఫియా ఫిర్దౌస్కు ప్రస్తుతం 32 ఏండ్లే. ఆమె సీనియర్ కాంగ్రెస్ నేత మొహమ్మద్ మోక్విమ్ కూతురు. ఈసారి తండ్రి స్థానంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన ఆమె, బెంగళూరు ఐఐఎంబీ నుంచి 2022లో ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తిచేశారు. 2023లో ఆమె ది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) భువనేశ్వర్ చాప్టర్ ఆఫ్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ భువనేశ్వర్ చాప్టర్ కో చైర్పర్సన్ కూడా. ఆమె షేక్ మిరాజుల్ హక్ అనే వ్యాపారవేత్తను వివాహమాడారు. ఒడిశా మొదటి మహిళా ముఖ్యమంత్రి నందినీ సత్పతిని ఫిర్దౌస్ అమితంగా ఇస్టపడుతారు. నందిని కూడా 1972లో బారాబాటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.






