ఘనవ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ,ఆగస్టు 19(విజయ క్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి అన్నారు.బుధవారం క్యాంపు కార్యాలయం ఛాంబర్ నుండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణ( సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ )పై మున్సిపల్ అధికారులు, ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ఐ ఐ టీ చెన్నై, శ్రీచర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ చెన్నై సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల (తడి, పొడి చెత్త వ్యర్థాల)నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ తడి, పొడి చెత్త వ్యర్ధాల నిర్వహణలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెరుగైన నిర్వహణ కోసం తగిన ప్రణాళికలను రూపొందించాలన్నారు.
పెరుగుతున్న ఘన వ్యర్ధాల సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం చూపేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇళ్ల నుండి వచ్చే చెత్తను తడి, పొడి వ్యర్ధాలుగా వేరు చేసి సేకరించడం ద్వారా వ్యర్ధాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చన్నారు. ప్రజలకు ఘన వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రజల సహకారం,మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు సమన్వయంతో పనిచేస్తే నగరం క్లీన్, గ్రీన్ సిటీగా మారుతుందన్నారు.
ఘన వ్యర్థాల నిర్వహణపై సరైన ప్రణాళిక పరిశోధనతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను రాబోయే ఐదు సంవత్సరాలలో స్వచ్ఛత నగరంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఎమ్మెస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రతిభా గణేషన్, రాజమోహన్ రెడ్డి, సంస్థల ప్రతినిధులు హర్షవర్ధన్, అరవింద్, గౌతమ్ కృష్ణ, ఇందుమతి, తానీషి పొన్నమ్మ, అన్నపూర్ణ కశ్యప్, ప్రీతి, దివ్య, మాలవి, తదితరులు పాల్గొన్నారు.






