calender_icon.png 7 June, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తన దందాపై ప్రత్యేక ఆపరేషన్స్

02-06-2025 12:10:06 AM

  1. ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్న పోలీసు బృందాలు
  2. వారం వ్యవధిలో 3 కేసుల నమోదు, ఐదుగురి అరెస్ట్
  3. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఎస్పీ అఖిల్ మహజాన్

ఆదిలాబాద్, జూన్ 1(విజయ క్రాంతి) :  జిల్లాలో నకిలీ విత్తనాలను దందాపై పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా నిఘా సారించింది. పూర్తి స్థాయిలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు నూతనంగా వచ్చిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో సిసిఎస్ బృందం, టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం లను ఏర్పాటు చేసి, నకిలీ విత్తన దందాపై కొరడా జూలిపిస్తున్నారు.

నకిలీ విత్తనాలు, ఎరువుల దందా చేస్తున్న వారి గుండెల్లో ఎస్పీ అఖిల్ మహజాన్ రైలు పరిగెత్తిస్తున్నాడు. గత వారం రోజుల వ్యవధిలోనే మూడు కేసుల్లో, ఏడుగురి పై కేసులు నమోదు చేసి, ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. నమోదైన 3 కేసులలో ఇచ్చోడ మండలంలో నలుగురిపై కేసు నమోదు కాగా, బేల మండలంలో ఇద్దరిపై కేసు నమోదవడం జరిగిందని, తలమడుగు మండలంలో ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ మూడు కేసులలో దాదాపు 78 నకిలీ విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అదేవిధంగా బేల నందు నమోదైన కేసులో 10 కిలోల లూజ్ విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అమాయక రైతులను, ఆదివాసి ప్రజలకు నకిలీ విత్తనాలను అందించి మోసం చేసే ఏ ఒక్కరిని జిల్లా పోలీస్ యంత్రాంగం విడిచి పెట్టదని స్పష్టం చేశారు. వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు.

నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి నిఘా వ్యవస్థను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజలకు నకిలీ విత్తనాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రైతులు ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన దుకాణాలలో నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే ముందు విత్తన ప్యాకెట్లపై సరైన లేబుల్ తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ ఉండేలా చూసుకోవాలని, విత్తనాలను తీసుకున్న తర్వాత దుకాణ యజమాని నుండి బిల్లు ను తప్పకుండా తీసుకోవాలని సూచించారు.

ప్రజలు నకిలీ విత్తనాలను, లూజ్ విత్తనాలను కొనకపోవడం శ్రేయస్కరమని, అలాంటి వారి సమాచారాన్ని డయల్ 100 లేదా  8712659965 నెంబర్ కి అందజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. పోలీసు, సీసీఎస్ బృందాలు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాల ను అరికట్టడం జరుగుతుందని తెలిపారు. గతంలో కేసులు నమోదైన వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.