12-09-2025 07:08:29 PM
మున్సిపాలిటీలలో ఇప్పటికే మంజూరు అయిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి పట్టణం నుండి పెబ్బేరు పానగల్ వెళ్లవలసిన రోడ్డు విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో మున్సిపాలిటీ, రోడ్లు భవనాలు, పబ్లిక్ హెల్త్ అధికారులతో రోడ్డు విస్తరణ పనులు, ఆయా మున్సిపాలిటీలలో పబ్లిక్ హెల్త్ ద్వారా పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణ పనులపై మాట్లాడుతూ... రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న కుటుంబాలలో ఇప్పటికే 23 కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని మిగిలిన అర్హులైన వారికి టిడిఆర్ కింద లబ్ధి చేకూర్చడం జరుగుతుందని అందువల్ల రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించే ప్రక్రియ మొదలు పెట్టాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. ఇప్పటికే చాలా అయిందని ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నిర్మాణాలను తొలగించే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. అదేవిధంగా రోడ్డు పక్కన ఆక్రమణ చేసిన యజమానులకు నోటీస్ జారీ చేసి అక్రమ నిర్మాణాలు తొలగించాలని సూచించారు.