28 March, 2026 | 3:16 AM

కల్యాణం.. కమనీయం

28-03-2026 01:28 AM

రంగారెడ్డి, న్యూస్ నెట్వర్క్, మార్చి 27( విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఆధ్యాత్మిక శోభతో మిన్నంటాయి. ఊరూవాడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగగా, ప్రధాన ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణాన్ని భక్తులు పెద్ద ఎత్తున తిలకించారు. నియోజకవర్గాల వారీగా వేడుకలు జిల్లాలోని అన్ని ప్రధాన నియోజకవర్గాల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.షాద్నగర్, చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రాంతాల్లోని పురాతన రామాలయాలు విద్యుత్ కాంతులతో ముస్తాబయ్యాయి.

ఇబ్రహీంపట్నం, మహేశ్వరం,గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భక్తులు వేకువజామునే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎల్బీనగర్, శేర్లింగంపల్లి నగర శివారు ప్రాంతాల్లోని భారీ ఆలయాల్లో కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆమనగల్ బ్లాక్ మండలాల్లోని గ్రామాల్లో భజనలు, కీర్తనలతో పండుగ వాతావరణం నెలకొంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు.

మైసిగండి ఆలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.లోక కల్యాణం కోసం నిర్వహించిన ప్రత్యేక హోమాల్లో మరియు పూజా కార్యక్రమాల్లో వారు పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

శోభాయాత్ర, అన్నదానం..

కల్యాణం అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శ్రీరామ చంద్రుని శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు.రథంపై ఊరేగుతున్న సీతారామ లక్ష్మణులను దర్శించుకునేందుకు ప్రజలు రోడ్లకిరువైపులా వేచి చూశారు.పండుగకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీలు మరియు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కూడా చేపట్టారు.