10-08-2025 08:33:49 PM
సిబ్బందికి ఎస్ఐ అభినందనలు
సదాశివనగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు నివారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోస్టు వద్ద బైక్ చోరీకి పాల్పడిన వ్యక్తిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ పుష్పరాజ్ తెలిపారు. సదాశివనగర్ కానిస్టేబుల్స్ అజార్, శ్రీకాంత్, తాడ్వాయి కానిస్టేబుల్ ఇర్ఫాన్ విధుల్లో ఉండగా రాత్రి అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యక్తిని వాహనం తనిఖీ చేయగా అనుమానం వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. కామారెడ్డి పట్టణం నుండి ఒక బైక్ దొంగిలించి వెళ్తున్నాడని తెలిసింది.
వెంటనే ఆ బైక్ను రికవరీ చేసి యజమానులకు సమాచారం అందించారు. ఈ సంబంధంగా కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదై ఉండటంతో సంబంధిత పోలీసులకు సమాచారం ఇచ్చి, దొంగను వారికి అప్పగించారు. దొంగతనాల నివారణ కోసం రాత్రంతా జాగ్రత్తగా నాకాబంది, వెహికిల్ చెకింగ్, పెట్రోలింగ్ నిర్వహించిన సదాశివనగర్ పోలీస్ సిబ్బందిని అజార్ శ్రీకాంత్, ఇర్ఫాన్లను, ఎస్ఐ పుష్పరాజ్ అభినందించారు. వారి చురుకైన విధుల నిర్వహణ వల్ల ఒక దొంగతనం కేసు బయటపడడమే కాకుండా, దొంగకు శిక్ష పడేలా చర్యలు తీసుకోగలిగామని ఎస్ఐ పుష్ప రాజ్ తెలిపారు.