నీతులు చెప్పడం మానాలి
బెంగాల్ సీఎం మమతపై అస్సాం సీఎం వ్యాఖ్యలు
రాంచీ, సెప్టెంబర్ 20: జార్ఖండ్ రాజధాని రాంచీలో శుక్రవారం జరిగిన పరివర్తన్ ర్యాలీలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీపై నిప్పులు చెరిగారు. వరదలతో సొంత రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. మమత మాత్రం జార్ఖండ్కు పాఠాలు నేర్పిస్తున్నారని దుయ్యబట్టారు. ‘బెంగాల్ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రజలు వరదలతో సతమతమవుతున్నారు. కానీ మమ తా మాత్రం వరద పరిస్థితుల్లో సరి గా పనిచేయని తమ అధికారులపై కాకుండా, జార్ఖండ్ ప్రజలపై ఆగ్ర హం వ్యక్తం చేయడం ఆశ్చర్యకరంగా ఉంది.
దీదీ ఝార్ఖండ్తో ఉన్న సరిహద్దులను మూసేస్తుంటే ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ కామ్గా ఉన్నారు’ అని హిమంత అసహనం వ్యక్తం చేశారు. బెంగాల్ వరదలకు జార్ఖండ్ కారణం కాదని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసిందని శర్మ పేర్కొ న్నారు. జార్ఖండ్ ప్రజలను కించపరిచేలా మమత మాట్లాడినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తనట్లు ఉందని విమర్శించారు. రాష్ట్ర గౌరవాన్ని కాపాడలేని పార్టీకి పాలించే హక్కు లేదన్నారు.




