4 May, 2026 | 11:08 AM

వ్యూహాత్మక మౌనమా..లేక పట్టుకోసమా?

03-09-2024 03:44 AM

ఎక్కడా కనిపించని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు గర్జించిన జనసేన అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇపుడు ఎందుకు మౌనంగా ఉన్నారని టీడీపీ, జనసేన సైనికులు చర్చించుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలతో కలిపి ఎన్డీయే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన వపన్ కల్యాణ్ అనంతరం డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్రంలో గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ సంఘటనలోగాని, ఇప్పుడు కనివిని ఎరుగని రీతిలో వరదలు వచ్చి విజయవాడ జలదిగ్బంధలో చిక్కుకున్నా పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం, పర్యటించడంగాని చేయలేదు.

సీఎం చంద్రబాబు అంతా తానై వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతు న్నా పవన్  కనీసం ఎక్కడా మాట్లాడడం లేదని జనసేన సైనికులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన సొంత శాఖలపై సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపిం చడం లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబును అనేకసార్లు కలిసిన పవన్ ఇప్పుడు మాత్రం పెద్దగా కలవడం లేదు. అంతేకాక టీడీపీ లీడర్లతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలపై టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న ఆగడాలపై పవన్ అసంతృప్తితో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు, టీడీపీ లీడర్లకు దూరంగా ఉంటూ మౌనం పాటిస్తున్నారని ఊహగానాలు వెలువడుతున్నాయి. పవన్  మౌనంపై  పసుపు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎపుడు ఏ బాంబ్ పేల్చుతారోనని అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే శాఖపై పట్టుపెంచుకోవడానికి సమయం కేటాయిస్తూ పవన్  వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం లేదని జనసైనికులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఏపీలో ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన పవ న్ నిజంగానే అసంతృప్తితో ఉన్నారా లేక కావాలనే మౌనం పాటిస్తున్నారా అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.