ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య
సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ సంతోష్ నాయక్
సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వాలని పిలుపు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఈనెల 19న ఉదయం 11 గంటలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మెన్ బక్కి వెంకయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రానున్నట్లు సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ సంతోష్ నాయక్ తెలిపారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, కుసురం నీలాదేవి, రేణుకోట్ల ప్రవీణ్, జిల్లా శంకర్, పలువురు జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ నాయక్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో ఎస్టీ, ఎస్సీ వర్గాలకు సంబంధించిన పలు సమస్యలను కమిషన్ చైర్మన్, సభ్యుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ ఉద్యోగులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రమోషన్లు, దళితులు, గిరిజనులపై జరుగుతున్న అంటరానితనం, కుల వివక్ష, సామాజిక వివక్ష సంఘటనలు, వాటిపై అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. అదేవిధంగా జిల్లాలోని గిరిజన, దళిత వర్గాలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఫలాలు, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు అందాల్సిన పరిహారం, కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం తదితర సమస్యలను కూడా కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని వివిధ సంఘాల నాయకులు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు సిద్ధం చేసుకుని ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యులకు అందజేయాలని సంతోష్ నాయక్ విజ్ఞప్తి చేశారు.






