06-11-2025 08:47:40 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): స్నేహిత కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రక్షణ, భద్రత, బాలబాలికల చట్టాలపై విస్తృతమైన అవగాహన కల్పించాలని, తద్వారా వారిలో ధైర్యం, భరోసా నింపాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్నేహిత రెండో దఫా అవగాహన కార్యక్రమాలపై కళాభారతిలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు సిబ్బందితో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ బాలబాలికలకు వారి రక్షణ, భద్రతపై అన్ని పాఠశాలల్లో ఇదివరకే ఒక దఫా అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశామని అన్నారు. ఈ కారణంగా విద్యార్థుల్లో అవగాహన వచ్చి తద్వారా ధైర్యంగా ఫిర్యాదులు చేసే స్థాయికి వచ్చారని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు వ్యవసాయ, వైద్య ఆరోగ్య, ఐసిడిఎస్, డిఆర్డి ఏ మెప్మా, పంచాయితీ అధికారులు, సిబ్బందితో ప్రతి మండలానికి ఒక టీం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందాలు ప్రతి మంగళవారం రెండు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మమేకమై వారి భద్రత, రక్షణకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటారని అన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సో చట్టం, లైంగిక వేధింపులు ఎలా ఎదుర్కోవాలో ఎలా ఫిర్యాదు చేయాలో ఈ సభ్యులు తెలియజేస్తారని అన్నారు. ప్రతి పాఠశాలలో స్నేహిత ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని విద్యార్థులు తమకు పాఠశాల సిబ్బంది నుండి గాని, బయట వ్యక్తుల నుండి గాని ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదు పెట్టెలో తమ ఫిర్యాదును వేయాలని చెప్పారు. ఈ ఫిర్యాదు పెట్టెను షీ టీం బృందాలు పర్యవేక్షిస్తాయని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు నమ్మకం, భరోసా కల్పించాలని, అది సామాజిక బాధ్యత అని అన్నారు.
బాలికల రక్షణ పట్ల తల్లిదండ్రుల కన్నా ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, మానవీయ కోణంలో వ్యవహరించాలని తెలిపారు. తదుపరి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు పిల్లలకు తామున్నామనే నమ్మకం కల్పించాలని అన్నారు. పాఠశాలల్లో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఫిర్యాదు చేసేలా స్నేహిత బృందాలు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. సమన్వయంతో రెండవ దఫా స్నేహిత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం స్నేహితా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, మెప్మా పిడి స్వరూపారాణి, షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీలత, అడిషనల్ డిఆర్డిఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ ఇతర అధికారులు, ఐసిడిఎస్ మెప్మా డి ఆర్ డి ఏ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉద్యోగులు పాల్గొన్నారు.