ప్రేమికుల ఆత్మహత్య
పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఉరేసుకున్న జంట
నెల రోజుల క్రితం ఘటన?
ములుగు (మహబూబాబాద్), జూన్ 8 (విజయక్రాంతి): ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు గుత్తి కోయకు చెందిన ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో టేకులకుంట గుత్తి కోయ గుంపులో కొంతమంది వలస గుత్తి కోయలు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. అదే గుంపులో ఉన్న కాశపు కోమల (18), కోరం ఇరుమయ్య (18) ప్రేమించుకున్నారు.
పెళ్లికి పెద్దలు సమ్మతించడం లేదని కొన్ని రోజుల క్రితం గుంపు నుంచి వెళ్లిపోయారు. అయితే వారు ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు, గుంపులో ఉన్నవారు భావించారు. చాలా రోజులైనా తిరిగి రాకపోవడంతో అడవిలో గాలించగా చివరికి వీరిద్దరూ ఒకే చెట్టుకు ఉరేసుకుని విగతజీవులుగా కనిపించారు. మృతిచెంది నెల రోజులు కావస్తున్నట్లు భావిస్తున్నారు. పసర ఎస్సై తాజుద్దీన్ ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






