3 May, 2026 | 1:29 AM

జర్నలిస్టుల పిల్లలకు చేయూత

03-05-2026 12:00 AM
  1. పది మంది చదువులకు రూ.25 వేల చొప్పున ఉపకార వేతనం
  2. హైబిజ్ టీవీ, లైఫ్‌స్పాన్ సంస్థలు సంయుక్తంగా అందజేత
  3. మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

శేరిలింగంపల్లి, మే 2 (విజయక్రాంతి): జర్నలిస్టుల పిల్లల ఉన్నత చదువుల కోసం హైబిజ్ టీవీ, లైఫ్ స్పాన్ సంస్థలు నడుంబిగించాయి. ఒక్కో విద్యార్థికి రూ.౨౫ వేల చొప్పున మొత్తం పది మంది విద్యార్థులకు రూ.25 వేల చొప్పున ఉపకార వేతనం ప్రకటించాయి. శనివారం ఈ మేరకు హైదరాబాద్‌లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 6వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవంలో నిర్వాహకులు రాష్ట్ర మంత్రి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా విద్యార్థులకు చెక్కులు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ మీడియాకు అనుకూలమని ఉద్ఘాటించారు. మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి ఉండాలని ఆకాంక్షించారు. జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త టెక్నాలజీల ప్రభావంపై సీనియర్ జర్నలిస్టులు ప్రభుత్వానికి సూచనలివ్వాలని కోరారు. అందుకు సరైన వేదిక కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

అనంతరం నిర్వాహకులు భూపేంద్ర చౌబే (సీఎన్‌ఎన్- న్యూస్ ఇండియా హెడ్, ఎన్‌డీటీవీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్), సుశీల్‌రావు సీహెచ్ (డెక్కన్ క్రానికల్, ది టైమ్స్ ఆఫ్ ఇండియా), బండారు శ్రీనివాస్‌రావు (ఆంధ్రజ్యోతి, ఆల్ ఇండియా రేడియో), మృణాళిని (దూరదర్శన్), శ్రీనాథ్ అయ్యర్ (ఈనాడు, ది హిందూ, హిందుస్థాన్ టైమ్స్)కు లెజండరీ అవార్డులు ప్రదానం చేశారు. అలాగే, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగాల్లో సమర్థంగా విధులు నిర్వరిస్తున్న 60 మందికి పైగా జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు.

అవార్డులు పొందిన వారిలో ‘విజయక్రాంతిదినపత్రిక చీఫ్ సబ్‌ఎడిటర్ వడ్లకొండ రతన్‌బాబు, ‘మెట్రోఇండియా’ దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్స్ మహేశ్ అవదూత, కిరణ్మయి తూతిక ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఇండియన్ న్యూస్‌పేపర్స్ సొసైటీ ప్రెసిడెంట్ వివేక్ గుప్తా, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి, లైఫ్ స్పాన్ సంస్థ అధినేత నరేంద్రరామ్ నంబుల, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జయదీప్‌రెడ్డి, హైబిజ్ టీవీ ఎండీలు ఎం.రాజ్‌గోపాల్, డాక్టర్ జె.సంధ్యారాణి పాల్గొన్నారు.