నల్లమలలో చిరుత అనుమానాస్పద మృతి
16-06-2024 01:32 AM
హైదరాబాద్/ నాగర్కర్నూల్, జూన్ 15 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్డ్ పరిధిలో శనివారం చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద జాతీయ రహదారి పక్కనే చిరుత మృతదేహం పడి ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. దోమలపెంట రేంజ్ అటవీ అధికారి గురుప్రసాద్ తెలిపిన ప్రకారం.. రోడ్డుపక్కనే చిరుత నిస్సాహాయస్థితిలో ఉన్నదని స్థానికులు సమాచారమివ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే చిరుత మృతిచెందినట్టు నిర్ధారించారు. వేరే క్రూర మృగంతో ఘర్షణకు దిగడంతో చిరుతమెడ భాగంలో తీవ్ర గాయమై మరణించినట్టు నిర్ధారించారు. చిరుత వయస్సు సుమారు 8 నెలలు ఉంటుంది.






