calender_icon.png 20 June, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోండి

20-06-2025 12:25:39 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి 

కొత్తకోట జూన్ 19 : భూ భారతి రెవెన్యూ సదస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గురువారం కొత్తకోట మండలం వడ్డే వాట గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. రెవెన్యూ సదస్సులో భాగంగా రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చారని, సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి గ్రామ ప్రజలు తమ భూ సమస్యలను నిర్ణిత ప్రొఫార్మలో పూరించి అధికారులకు ఇవ్వాలని సూచించారు.

పేర్లలో తప్పుల సవరణ వంటివి వెంటనే పరిష్కారం అవుతాయని, మ్యుటేషన్, సక్సెషన్, సాదా బైనామా, ఆర్.ఎస్.ఆర్ వంటివి నోటీస్ లు జారీ చేసి పరిశీలన అనంతరం పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వడ్డే వాట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారుల ఇళ్లను సందర్శించారు.

కంసలి పార్వతమ్మ భర్త కంసాలి సాంతన్న ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఇల్లు మంజూరు అయినప్పటికీ నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభించలేదని అడిగారు. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది రోజులు బాగాలేవు అందువల్ల ప్రారంభించలేదని పార్వతమ్మ సమాధానం ఇచ్చింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని, త్వరగా ప్రారంభిస్తే బేస్మెంట్ పూర్తి కాగానే అందరితో పాటు మొదటి విడత లక్ష రూపాయలు ఖాతాలో జమ అవుతాయన్నారు.

నిర్మాణం అయ్యే నాటికి విడతల వారిగా డబ్బులు ఖాతాలో జమ అయిపోతాయన్నారు. ఆషాఢం అని రోజులు బాగా లేవని మూఢ నమ్మకాలతో కాలాయపన చేయవద్దని, గడువు లోపల ఇంటి ని ర్మాణం ప్రారంభించకుంటే మంజూరు అయిన ఇళ్లు సైతం రద్దు అవుతాయని తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన సదవకాశాన్ని మూఢ నమ్మకాలతో కాలరాసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

గ్రా మంలో మొత్తం 23 ఇళ్ళు మంజూరు కాగా మూఢ నమ్మకాలతో చాలా మంది నిర్మాణం ప్రారంభించ లేదు. గ్రామంలో మిగిలిన వారి ఇంటిని కూడా కలెక్టర్ స్వయంగా వెళ్లి త్వరగా ముగ్గులు పోసి నిర్మాణం ప్రారంభించాలని సూచించారు.

చివరి రోజు కానాయపల్లిలో భూ భారతి 

కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ శివ కుమార్ టీం భూ భారతి సదస్సు చివరి రోజు చేపట్టారు. గ్రామంలో ఆయా సమస్యలతో కూడిన 48 దరఖాస్తులు వచ్చాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు న్యాయం చేస్తామని డీటీ శివ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంకటేశ్వర్లు, డీటీ శివ కుమార్, రెవెన్యూ సిబ్బంది వాసు, రాము, రఘు, మమత, విజయలక్ష్మి, కుర్మయ్య, రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.