02-07-2025 12:00:00 AM
ఆఫీసు ఎదుట రైతుల సంబురాలు
తలకొండపల్లి, జూలై 1: రంగారెడ్డి జిల్లా కందుకూర్ డివిజన్ తలకొండపల్లి మండల తహసీల్దార్ నాగార్జున ఓ రైతు నుంచి మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు కుటుంబ సభ్యులకు తమ పూర్వీకుల నుంచి వ్యవసాయ పొలం సంక్రమించింది. ఆ పొలాన్ని తమ నలుగురు సోదరుల పేర విరాసత్ చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
అందుకు తహసీల్దార్ నాగార్జున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రైతు మల్లయ్య ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు మంగళవారం తహసీల్దార్ ఆఫీసులు అటెండర్గా పనిచేస్తున్న యాదగిరికి రూ.10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తహసీల్దార్తోపాటు అటెండర్ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కాగా తహసీల్దార్ అరెస్టుతో మండల రైతులు మంగళవారం రాత్రి తహసీల్దార్ ఆఫీసు ఎదుట బాణసంచా పేల్చుతూ సంబురాలు చేసుకున్నారు. సంవత్సర కాలంగా తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న నాగార్జున కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి రైతుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవాడని రైతులు ఆరోపించారు.