12 May, 2026 | 3:49 PM

​వెల్డండ విద్యార్థుల ప్రతిభ అమోఘం

12-05-2026 02:34 PM

 ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

 జేఈఈ మెయిన్స్ విజేతలకు ఘన సన్మానం

– రూ. 16,000 ఆర్థిక సాయం అందజేత

అమనగల్లు,(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం వెల్డండ మండలానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ చాటడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విజేతలను ఘనంగా సన్మానించారు.మండల ఎస్‌ఎస్‌ఎల్ అధ్యక్షులు కొమ్ము నాగయ్య కుమార్తె కొమ్ము హన్సిక, అలాగే దాసరి లింగం కుమార్తె దాసరి అఖిల జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ పర్సంటైల్ సాధించి మండలానికి మంచి పేరు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా చైర్మన్ వారిని శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రోత్సాహకంగా తన వ్యక్తిగత నిధుల నుండి ఒక్కొక్కరికి రూ. 8,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. "గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు లేకున్నా, పట్టుదలతో చదివి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించడం గర్వకారణం.

విద్యార్థులు తమ లక్ష్యాన్ని విస్మరించకుండా కష్టపడి చదివి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలి" అని పిలుపునిచ్చారు. విద్యార్థుల వెనుక ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ సర్పంచులు ప్రభాకర్, కృష్ణారెడ్డి, వీరేషం, మాజీ ఎంపీటీసీలు లింగం, జ్యోతి నిరంజన్, సీనియర్ నాయకులు జోగయ్య, సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు దేవేందర్, ఆనంద్, ఉప సర్పంచ్ కొండల్ యాదవ్, నాయకులు ప్రవీణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.