calender_icon.png 24 June, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాపింగ్ దందా!

24-06-2025 01:26:49 AM

సిట్ ఎదుట మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం

  1. ఎస్‌ఐబీ తప్పుదోవ పట్టించింది..
  2. కాంగ్రెస్ లీడర్ల పేర్లను మావోయిస్టులుగా చూపుతూ నంబర్లు పంపారు.. 
  3. ఆనాడే అభ్యంతరం తెలిపాం: శాంతికుమారి
  4. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఫోన్ల ట్యాపింగ్ సిట్ అధికారులకు ఆధారాలు.. 
  5. ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు ఎంపీ ఈటల, గుజ్జుల, గంగిడిలకు పిలుపు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి) : రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ దూకు డు పెంచింది. ఈ కేసులో మరిన్ని కీలక.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండగా, ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నేతల వాంగ్మూలాలను సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రె స్, బీజేపీ నేతలతో పాటు పలువురు ప్రముఖులు, ఉద్యమకారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది.

సోమవారం సిట్ విచారణకు హాజరైన నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి, ఫోన్ ట్యాపింగ్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ).. రివ్యూ ప్యానెల్‌ను తప్పుదోవ పట్టించిందని సంచలన వాంగ్మూలం ఇచ్చారు. ఎస్‌ఐబీ పంపిన నంబర్లపై తాము అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ట్యాపింగ్ యథేచ్ఛగా జరిగిం దని ఆమె వెల్లడించినట్లు సమాచారం.

ఎస్‌ఐబీ తప్పుడు సమాచారం..

కాంగ్రెస్ నాయకుల పేర్లను మావోయిస్టులుగా చూపుతూ, వారి ఫోన్ నంబ ర్లను ట్యాపింగ్ అనుమతి కోసం రివ్యూ ప్యానెల్ ముందుకు పంపారని శాంతికుమారి పేర్కొన్నట్లు తెలిసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్‌కు రాష్ర్ట హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ నుంచి ముందస్తు అనుమతి, ఆపై రివ్యూ కమిటీ ద్వారా కేంద్ర టెలికం శాఖ అనుమతి తప్పనిసరి.

అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని బృందం సుమారు 618 ఫోన్ నంబర్లను రివ్యూ కమిటీ ముందు పెట్టగా, వాటిలో చాలా వరకు తప్పుడు సమాచారంతో ఉన్నాయని మాజీ సీఎస్ వాంగ్మూలం ద్వారా స్పష్టమవుతోంది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు స్టేట్‌మెంట్‌ను కూడా సిట్ అధికారులు రికార్డు చేశారు.

ఎస్‌ఐబీ ఎవరి కనుసన్నల్లో..?

రివ్యూ ప్యానెల్ అభ్యంతరాలు వ్యక్తంచేసినప్పటికీ ఫోన్ ట్యాపింగ్ యథేచ్ఛగా జరగడంతో, ఎస్‌ఐబీ ఎవరి నియంత్రణలో పనిచేసింది? ఆ విభాగానికి అసలు బాస్ ఎవరు? తెరవెనుక ఎవరు ఉండి ఇదంతా నడిపించారు? అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో విచారణ సందర్భంగా మాజీ డీఎస్పీలు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన నేరాంగీకారపత్రంలో అప్పటి బీఆర్‌ఎస్ సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం డీజీపీ, ప్యానెల్ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసినట్లు చెప్పడం గందరగోళానికి దారితీస్తోంది.

ఎన్నికల సమయంలో ట్యాపింగ్.. నగదు సీజ్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులకు తాజాగా ఆధారాలు లభించాయి.ప్రణీత్ రావు నుంచి ట్యాపింగ్ సమాచారం టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు చేరేదని, ప్రభాకర్ రావు ఆదేశాలతోనే టాస్క్‌ఫోర్స్ బృందం రంగంలోకి దిగేదని తెలిసింది.

2018 ఎన్నికల సమయంలో.. 

ప్రణీత్ రావు నుంచి టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం చేరేదని, ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్యారడైజ్ వద్ద భవ్య ఆనంద్‌ప్రసాద్‌కు చెందిన రూ.70 లక్షల డబ్బును సీజ్ చేసినట్లు సమాచారం. ఆ ఎన్నికల్లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థిగా ప్రసాద్ పోటీచేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్‌రావు బంధువులకు చెందిన రూ.కోటి కూడా ఫోన్ ట్యాపింగ్ సమాచారంతోనే బేగంపేటలో రాధాకిషన్‌రావు బృందం సీజ్ చేసింది. మునుగోడు ఉపఎన్నికలో నల్గొండ కాంగ్రెస్ నేతల అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ సోదరుడు కొండల్‌రెడ్డి కామారెడ్డిలో అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది.

ఉద్యమకారుల ఫోన్లపైనా నిఘా..

తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్య వేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సిట్‌కు లేఖ రాశాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను సైతం ట్యాప్ చేసిందని ఆరోపించాయి. 2018 ఎన్నికల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినందుకు హరీశ్‌రావు బెదిరించారని, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికలతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉద్యమకారుల ఫోన్లు ట్యాప్ చేసి, అక్రమ కేసులు బనాయించి, నామినేషన్లు వేయకుండా భయపెట్టించారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వారి అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో ఏ1 మినహా మిగతా నిందితులంతా బీఆర్‌ఎస్ సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చినందున కేసీఆర్‌ను కూడా విచారణకు పిలుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, ఆయనను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ఏర్పా ట్లు చేసుకుంటోందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాధితులు, ప్యానెల్ కమిటీ సభ్యుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కామారెడ్డి కాంగ్రెస్ నేతలకు సిట్ పిలుపు

కామారెడ్డి(విజయక్రాంతి): గత శాసనసభ ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేయడంతో స్థానికంగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లను టాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవరాజుగౌడ్ ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు తెలుస్తోంది.

ఆయనతోపాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి వాంగ్మూలం వినిపించాలని కోరినట్లు తెలిసింది. ఈ మేరకు సోమవారం వారు తమ వాంగ్మూలాన్ని సిట్ ఎదుట వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ప్రచార బాధ్యతలను ఎక్కువగా ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి చూసుకున్నారు. కొండల్‌రెడ్డికి అండగా నిలిచిన దేవరాజుగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డిల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉంటారని తెలుస్తోంది. 

నేడు విచారణకు ఎంపీ ఈటల, గుజ్జుల, గంగిడికి పిలుపు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందరకు, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ర్ట ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డిలు విచారణకు హాజరుకానున్నారు. ఈటల, ప్రేమేంద్ రెడ్డిలను ఉదయం 11గంటలకు విచారణకు హాజరుకావాలని సిట్ కోరింది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాలో వారు కూడా ఉండటంతో వారి నుంచి వాంగ్మూలం తీసుకోనుంది.

హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంతో పాటు అంతకుముందు.. తర్వాత తన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లుగా ఈటలు పలు సందర్భాల్లో తెలిపారు. అలాగే మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగిడి ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్‌చార్జ్‌గా మనోహర్ రెడ్డి వ్యవహరించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ వెన్నంటి ఉన్న నేతల ఫోన్లన్నీ ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించింది.

వీలు చూసుకుని రెండు రోజుల్లో సిట్ ముందు హాజరుకావాలని గంగిడికి సిట్ అధికారులు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీసీసీ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మన్ దేవరాజు గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో విచారణకు హాజరుకావాలని ఆయనకు కూడా సిట్ బృందం ఆదేశించింది. ఇకపోతే సోమవారం మేడ్చల్ కాంగ్రెస్ నేత హరివర్ధన్‌రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్‌రెడ్డి సిట్ ముందు హాజరై తమ ఫోన్ ట్యాపింగ్ వివరాలపై వాంగ్మూలం ఇచ్చారు.