02-06-2025 04:10:49 PM
కొన్నిచోట్ల మొక్కుబడిగా..
మహబూబాబాద్,(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు(Telangana State Formation Celebrations) ఈసారి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా నిర్వహించారు. చాలా చోట్ల జెండా వందనం నిర్వహించి ‘మమ’ అనిపించినట్లు విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఏదో మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల్లో అయితే ఉపాధ్యాయులు(Teachers) పూర్తిస్థాయిలో పాల్గొనలేదనే విమర్శలు వస్తున్నాయి. వరంగల్ వైపు నుంచి డోర్నకల్ కు వెళ్లే పుష్ పుల్ ప్యాసింజర్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాజీపేట, వరంగల్ నుంచి మహబూబాబాద్, ఖమ్మం వరకు నిత్యం షటిల్ సర్వీసులు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం కూడా పుష్ పుల్ రైలులోనే రావడంతో ఆ రైలు కాస్త గంట ఆలస్యం కావడంతో సోమవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ సమయానికి హాజరు కాకపోవడంతో చాలాచోట్ల ఉన్నవారే జాతీయ పతాకావిష్కరణ చేయాల్సి వచ్చింది. జాతీయ పతాకావిష్కరణ చేసిన తర్వాత నింపాదిగా పాఠశాలలకు, కార్యాలయాలకు చేరుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నట్లు ముఖం చూపించి తిరిగి గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు(Golconda Express train)లో తమ ఇంటికి వెళ్లిపోయారు. ఏతవాత ఈసారి ఆవిర్భావ వేడుకలు సందడి లేకుండా సాదాసీదాగా ముగించారనే విమర్శలు మూటగట్టుకున్నారు.