30-05-2025 02:34:24 AM
కరీంనగర్, మే 29 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలోనే లేనివిధంగా, దేశంలోనే అత్యధిక వరి దిగుబడి సాధించి తెలంగాణ చరిత్ర సృష్టించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖమంత్రి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్ల నుంచి చుక్క నీరు రాకున్నా, ఈ ఘనత సాధించామన్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గురువారం ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల సాగు సన్నద్ధతపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, బీసీ సంక్షేమశాఖ మం త్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, విజయ రమణారావు, ఠాకూర్ మక్కాన్ సింగ్, ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగ స్వామ్యం చేస్తామన్నారు. సిల్ట్ కారణం గా ఎస్సారెస్పీ ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీ సిల్టేషన్తో పూర్వపు సామర్థ్యాన్ని తీసుకొస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కాలువలు, తూములు, ఓటి మరమ్మ తు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూ చించారు.
ప్రజాప్రభుత్వం 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, 2023 లో అప్పటి ప్రభుత్వం కేవలం 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. ఈ యాసంగిలో రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో 130 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున ధాన్యం సాగు జరగలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై జ్యుడీషియెల్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతికి ఆస్కారం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేదని రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పేర్కొన్నారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపిక చేయాలనారు. గత పాలకుల హయాంలో రైస్మిల్లుల వద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులు గురయ్యారని, ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఈ ఇబ్బంది రాలేదని అ న్నారు. మలక్పేట, సూరమ్మ, మోతే నారాయణపూర్, గౌరవెల్లి తదితర ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
ప్రభుత్వ పాలనా దక్షతతోనే అధిక దిగుబడి: మంత్రి దుద్దిళ్ల
ప్రభుత్వ పాలనా దక్షతతోనే తెలంగాణ దేశంలోనే అత్యధికంగా వరిని సాగు చేసిందని, అదే స్థాయిలో కొనుగోళ్లు చేపట్టిందని ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఉమ్మడి కరీంనగర్లో పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లను చేపట్టి నట్టు మంత్రి పేర్కొన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ. 51 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
తడిసిన ధాన్యం కూడా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు అందుబాటులో పెట్టాలని సూచించారు. మనిషికి ఆధార్కార్డు ఉన్నట్టు, భూమికి భూదార్ కార్డు సర్వే నెంబర్, యాజమాన్యం, విస్తరణ, బౌండరీ వివరాలు ఉండేలా అందిస్తామని చెప్పారు.