జ్యోతికి పసిడి పతకం
ఆమ్స్టర్డామ్: తెలుగు స్ప్రింటర్ జ్యోతి ఎర్రాజీ హారీ స్కల్టింగ్ గేమ్స్లో స్వర్ణ పతకంతో మెరిసింది. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన పోటీలో జ్యోతి అగ్రస్థానం దక్కించుకుంది. గురువారం జరిగిన 100మీ హార్డిల్స్ ఫైనల్లో జ్యోతి 12.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ మార్క్ను (12.77) అధిగమించడంలో జ్యోతి విఫలమైంది. అయితే ర్యాంకింగ్స్ ఆధారంగా జ్యోతి పారిస్ బెర్తు దక్కించుకునే అవకాశముంది. ప్రస్తుతం ఆమె 26వ ర్యాంక్లో కొనసాగుతుంది. పారిస్ ఒలింపిక్స్లో 100 మీ హార్డిల్స్లో మొత్తం 40 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. వీరిలో 25 మంది ఎంట్రీ స్టాండర్డ్ ద్వారా, మరో 15 మంది ర్యాంకింగ్స్ ఆధారంగా అర్హత సాధించనున్నారు. హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో జ్యోతి రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో జ్యోతీ 100 మీటర్ల హార్డిల్స్ను 12.78 సెకన్లలో పూర్తి చేసి కెరీర్ బెస్ట్ సాధించింది.






