01-01-2026 04:26:13 PM
ఆలయాలకు పోటెత్తిన భక్తులు
భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల క్షేత్రం
చల్లంగా చూడమ్మా.. వన దుర్గమ్మ తల్లి.. అంటూ వేడుకున్న భక్తులు
విజయక్రాంతి,పాపన్నపేట: నూతన సంవత్సరం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం గురువారం భక్తులతో జనసంద్రమైంది. ఎటు చూసినా జనమే కనిపించారు. కొత్త సంవత్సరం అన్ని విధాల సంతోషాలతో సాగాలని జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వనదుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు.
ముందుగా అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీ పాయలో, చెక్ డ్యామ్ లో పుణ్య స్నానాలు ఆచరించి వన దుర్గమ్మ దర్శనానికి బారులు తీరారు. ప్రతి ఉండటంతో అమ్మ దర్శనానికి సమయం పట్టింది. పలువురు భక్తులు వాహనాలకు పూజలు నిర్వహించారు. సంవత్సరమంతా సుఖ, సంతోషాలతో ఉండాలని, కోరిన కోరికలు తీర్చి చల్లంగా చూడమ్మా.. వన దుర్గమ్మ తల్లి.. అంటూ భక్తులు వేడుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి దీవించారు.