అదే అసలైన సవాల్
న్యూయార్క్: తన దృష్టిలో సారథ్యం అసలైన సవాల్ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్గా ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదని.. వారి ఆలోచన విధానం విభిన్నంగా ఉంటుందని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న రోహిత్ కెప్టెన్సీపై స్పందించాడు. ‘సారథిగా నేను చాలా వరకు డేటాపై ఆధారపడతాను. దానిని విశ్లేషించే వ్యూహాలు సిద్ధం చేసుకుంటాను. ఇందుకోసం గంటల కొద్దీ సమయం మీటింగ్ రూముల్లో గడుపుతా. మైదానంలోకి దిగే సమయానికి అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవడానికి పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటా. మ్యాచ్లో ఆటగాళ్లను సమన్వయం చేసుకోవడం కెప్టెన్కు సవాల్ లాంటిది. ఇక్కడ ఆటగాళ్ల ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. అవసరాన్ని బట్టి స్పందిస్తూ అందరికి సమప్రాధాన్యం ఇవ్వాలి. విభిన్న శైలి కలిగిన ఆటగాళ్లను అర్థం చేసుకొని సూచనలు ఇచ్చేందుకు కెప్టెన్ రెడీగా ఉండాల్సిందే’ అని రోహిత్ పేర్కొన్నాడు.






