calender_icon.png 28 June, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికోల ‘ఉపకార’ పోరు

28-06-2025 01:27:45 AM

  1. వైద్యవిద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న ప్రైవేటు కాలేజీలు

ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన బాట

హైదరాబాద్, జూన్ 27(విజయక్రాంతి): లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేసే ప్రైవే టు మెడికల్ కాలేజీలు వైద్యవిద్యార్థులకు న్యా యంగా చెల్లించాల్సిన స్టుఫైండ్స్ విషయంలో తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చెల్లిస్తున్నప్పటికీ ప్రైవేటు కాలేజీల్లో దోపిడీ కొనసాగుతోంది. కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు, ప్రభుత్వ జీవోలను సైతం లెక్క చేయడం లేదు.

ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ దోపిడీపై అనేకసార్లు విజ్ఞప్తి చేసినా, ప్రశ్నించినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. స్టుఫైండ్స్ ఇవ్వకపోగా.. మీరు కోర్సు పూర్తి చేసి బయటకు వెళ్లాలంటే తాము చెప్పిన ట్లే నడుచుకోవాలని మేనేజ్‌మెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఈ దుర్మార్గంపై మెడి కోలు తిరగబడ్డారు. రాష్ర్టంలోని అన్ని ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న మెడికోలు, పీజీలు ఆందోళన చేపట్టారు.

ఇందుకు మెడికోలంతా ఐక్యంగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఎంబీబీఎస్ విద్యను అందించే 29 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ ఇదే దందా సాగుతోంది. పీజీ విద్యను అందించే 19 ప్రైవేటు మెడికల్ కాలేజీలు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నా యి.

ప్రైవేటు మె డికల్ కాలేజీల్లో 4,750 మంది ఎంబీబీఎస్(చివరి సంవత్సరం చదువుతున్నవారికి మాత్రమే), 19 పీజీ కాలేజీల్లో ఏడాదికి 1,511 మంది చొప్పున మూడేళ్లకు 4,750 మంది పీజీ చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో ఎంబీబీఎస్, పీజీ చేస్తూ ప్రైవేటు కాలేజీ ల దోపిడీకి గురవుతున్న మెడికోల సంఖ్య 9,040.

కూలీల కంటే తక్కువగా..

నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) 2023 లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు స్టుఫైండ్ ప్రతినెలా ఇవ్వాలి. తెలంగాణలో నిబంధనల మేరకు ఎంబీబీఎస్ ఇంటర్న్స్‌కు చివరి ఏడాది నెలకు రూ.25,900, పీజీ విద్యార్థులకు మూడేళ్లకుగాను వరుసగా రూ.58,289 64,767 వరకు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి అడ్మిషన్ సమయంలోనే కేటగిరీ వారీగా రూ.లక్షల్లో ఫీజులు వసూలుచేస్తున్న మేనేజ్‌మెంట్లు.

.అడ్వాన్స్‌గా వారి వద్ద నుంచి స్టుఫైండ్స్ కోసం ఒక్కో చోట ఒక్కోలా వసూలు చేస్తున్నాయి. స్టుఫైండ్ చెల్లించే విషయంలో మా త్రం కనీసం స్పందించడం లేదు. ఒక్కో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థిపై దాదాపు రూ.1.20కోట్లు వసూలు చేస్తున్నాయని విద్యార్థులంటున్నారు. తమతో గంటలకు గంటలు పనిచేయిస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని కానీ స్టుఫైండ్స్ చెల్లించ డంలో మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థి వాపోయారు.

ఎన్‌ఎంసీ తనిఖీలకు వచ్చే సమయంలో స్టుఫైండ్ చెల్లిస్తున్నట్లుగా చూపించేందుకు గానీ శుక్ర వారం తన ఖాతాలో రూ. 25,900 జమ చేశారని.. ఆ డబ్బులు విత్‌డ్రా చేసుకుని తెచ్చి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని ఆ జూనియ ర్ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.  

ఎన్‌ఎంసీ, ప్రభుత్వాలను ఏమారుస్తున్న ప్రైవేటు మాఫియా..

రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ ప్రైవేటు మెడికల్ కాలేజీలు మెడికల్ విద్యార్థుల రక్తం తాగుతున్నాయని వైద్య రంగానికి చెందిన నిపుణులు ఆరోపిస్తున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాలు చదివిన తర్వా త ఇంటర్న్‌షిప్ చేసే సమయంలో వారికి న్యాయంగా రూ. 25,900 స్టుఫైండ్‌గా ఇవ్వాల్సి ఉన్నా ప్రైవేటు కాలేజీలు పైసా కూడా ఇవ్వకుం డా వారి సేవలను పొందుతున్నాయి.

దీనిపై ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేస్తే రాష్ట్రాల మీదకు నెట్టేసి చోద్యం చూస్తోందని కరీంనగర్‌లోని చెల్మెడ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థి ఆరోపించా రు. డీఎంఈ కానీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కానీ ఈ అంశంలో ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని మెడికోలు ఆరోపిస్తున్నారు. 

అన్ని మెడికల్ కాలేజీల్లోనూ ఇదే దందా..

పట్నం మహేందర్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో ఒక ఇంటర్న్‌కు ప్రతి నెలా బ్యాంకు ఖాతాకు రూ.25,000 జమ చేస్తారు. వెంటనే వాటిని విత్‌డ్రా చేసుకుని రూ.20,000 కళాశాలకు నగదు రూపంలో తిరిగి చెల్లించాల్సిందే. ఇక్కడ ఆ విద్యార్థికి రూ.5 వేలైనా దక్కు తున్నాయనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఆ విద్యార్థి నుంచి అప్పటికే 5 ఏళ్లలో ఏడాదికి కొంత వసూలు చేసుకుని..

ఇప్పుడు తిరిగి వాటి నుంచే నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తారు. మెడికల్ కాలేజీ యాజమాన్యం తమ చేతినుంచి ఒక్క పైసా కూడా స్టుఫైండ్ రూపంలో ఇవ్వదు. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అయితే నెలనెలా రూ.25,900 చొప్పున నేరుగా విద్యార్థి ఖాతాలో జమ అవుతుంది. ఇది ఒక్క పట్నం మహేందర్ రెడ్డి కాలేజీలో మాత్రమే కాదు.. అన్నింటా ఇదే పరిస్థితి.

పట్నం సహా ప్రతి మ, చల్మెడ ఆనంద్‌రావు, కామినేని, ఎస్వీఎస్, ఎంఎన్‌ఆర్, మెడిసిటీ, మమత, భాస్కర్, కామినేని అకాడమీ, అపోలో, ఆర్‌వీఎం, మహావీర్, దక్కన్, షాదన్, వీఆర్‌కే ఉమెన్స్, సురభి, మమ త అకాడమీ, మహేశ్వర మెడికల్ కాలేజీలు పీజీ విద్యార్థులతో చాకిరీ చేయించుకుంటూ స్టుఫైండ్స్ ఇవ్వకుండా వేధిస్తున్నాయని చెబుతున్నారు. 

మంత్రికి, ఎన్‌ఎంసీకి ఫిర్యాదు చేసినా..

ప్రైవేటు కాలేజీలు చేస్తున్న అన్యాయంపై వైద్యఆరోగ్య శాఖ మంత్రికి, ఎన్‌ఎంసీకి, డీఎంఈకి, కాళోజీ వర్సిటీ వీసీకి అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీలు ఓ మాఫియాలా మారి ఎన్‌ఎంసీ సహా ప్రజాప్రతినిధులను మేనేజ చేస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన మెడికల్ కాలేజీలు కావడంతో పార్టీలకు అతీతంగా అంతా ఒక్కటై తమకు న్యాయం చేయడం లేదని కూడా మెడికోలు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలపై ప్రతిపక్షాలు స్పందించకపోవడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు.