భూ సమస్యల శాశ్వత పరిష్కారమే భూభారతి చట్టం
కొండారెడ్డిపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
నాగర్కర్నూల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టం శాశ్వతంగా భూ సమస్యలకు పరిష్కారం చూపనుందని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్(District Collector Badavath Santosh) అన్నారు. గురువారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి భూ సమస్యకు స్థిరమైన పరిష్కారం అందించేందుకు రెవెన్యూ సదస్సులు గొప్ప వేదిక అవుతున్నాయన్నారు. రైతులు వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు.
వచ్చిన దరఖాస్తులపై ఫీల్డ్ పరిశీలన పూర్తయ్యాక వాటిని ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, వారి సమస్యలను తెలుసుకొని, భూభారతి చట్టంలోని అంశాలను వివరించారు. సదస్సులో రెవెన్యూ అధికారులు ప్రింటెడ్ దరఖాస్తు ప్రొఫార్మాలను అందజేశారు. హెల్ప్ డెస్క్ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, వంగూరు తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






