06-02-2026 01:44:32 AM
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన
కేసముద్రం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఇంటి పక్కన పార్కు చేసిన బైక్ను బయటకు వెళ్లడానికి తీసిన వ్యక్తిని అందులో తిష్ట వేసిన పాము కాటేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో గురువారం జరిగింది. బైక్ స్టార్ట్ చేసిన వెంటనే అందులో నుండి పాము ఆ కాలిని కాటేసి పారిపోయింది. పాము బైక్ నుంచి బయటకు వచ్చి ఆ వ్యక్తిని కాటేసి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని చూసిన కొందరు గమనించి వెంటనే బాధితున్ని ఆస్పత్రికి తరలించారు.
కేసముద్రం పట్టణ పరిధిలోని తమ్మడ బోయిన రవి అనే వ్యక్తి ఇంటి పక్కన బైక్ పార్క్ చేశాడు. ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు బైక్ బయటకు తీసి స్టార్ట్ చేసి ముందుకు వెళుతుండగా కాలికి ఏదో గుచ్చుకున్నట్టు కావడంతో వెంటనే బండిని ఆపాడు. ఇదే క్రమంలో అక్కడ ఉన్న కొందరు బైక్లో నుంచి పాము బయటకు వచ్చి వెళ్లిపోవడానికి గమనించి హుటాహుటిన అక్కడికి చేరుకొని రవి కాలిని పరిశీలించగా వెంటనే కాలు వాపు రావడం గుర్తించారు.
పాము కాటేసిందని నిర్ధారించి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి అక్కడ ప్రధమ చికిత్స చేయించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. రవి ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్ లో నుంచి బయటకు వచ్చి పాము కాటేసిందని, అయితే సకాలంలో గుర్తించడం వల్ల, వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు చెప్పాడు.