07-06-2025 12:03:56 AM
ముంబై, జూన్ 6: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా మూడో సారి రెపోరేటును తగ్గించింది. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర అధ్యక్షతన జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమీక్షలో రెపోరేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 4న మొదలైన ఈ సమావేశం మూడు రోజు ల పాటు జరిగి శుక్రవారంతో ముగిసింది.
ఆర్బీఐ నిర్ణయంపై వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఆసక్తిగా తిలకించారు. వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటుగా మానిటరీ పాలసీ కమిటీ తన స్టాన్స్ను అకామడేటివ్ నుంచి న్యూట్రల్కు మార్చింది. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి దోహదపడనుంది. ఆర్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయంతో గృహరుణాలు తీసుకున్న వారిపై ఈఎంఐల భారం తగ్గనుంది. మానిటరీ పాలసీలో ఆరుగురు సభ్యులు ఉంటారు.
క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను కూడా 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించారు. ప్రస్తుతం అది 3 శాతంగా కొనసాగుతోంది.ఆర్బీఐ రెపోరేటును తగ్గించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. తాజా తగ్గింపుతో ఆర్బీఐ రెపోరేటు 6.5 శాతం నుంచి 5.5 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ నిర్ణయంతో మార్కెట్లో ద్రవ్య లభ్యత పెరగనుంది. గృహాల కొనుగోలు ఇతర అవసరాల కోసం ఫ్లోటింగ్ రేట్తో తీసుకున్న బ్యాంకు రుణాల ఈఎంఐలు తగ్గనున్నాయి.
ఆర్థిక వ్యవస్థ సరిగ్గానే ఉంది
దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దారిలోనే పయనిస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హో త్ర తెలిపారు. గవర్నర్ మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నా.. మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. స్థిరంగా కొనసాగుతోంది. పెట్టుబడిదారులకు అపార అవకాశా లు కల్పిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. మొదటి త్రైమాసికంలో 6.5 శాతం, రెండో త్రైమాసికంలో 6.7 శాతం, మూడో త్రైమాసికంలో 6.6 శాతం మేర, ఆఖరి త్రైమాసికంలో 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఆహారపదార్థాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో 2025-26 ఆర్థిక సంవత్సర ద్రవ్యోల్బణ అంచనాలను 4 శాతం నుంచి 3.7శాతానికి తగ్గిస్తున్నాం. బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నాం.ద్రవ్యోల్బణంపై మనం విజయం సాధించాం.’ అని పేర్కొన్నారు.