calender_icon.png 7 June, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ ఊరటనిచ్చిన ఆర్‌బీఐ

07-06-2025 12:00:00 AM

రెపోరేటు 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు

ముంబై, జూన్ 6: మధ్యతరగతి వేతన జీవులకు ఆర్‌బీఐ భారీ ఊరటనిచ్చింది. మానిటరీ పాలసీ రెపోరేట్‌ను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్టు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర శుక్రవారం వెల్లడించారు. ఈ తగ్గింపుతో 6 శాతంగా ఉన్న రెపోరేటు కాస్త 5.50 శాతానికి దిగి వచ్చింది. ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.

గత రెండు పర్యాయాల్లో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన సెంట్రల్ బ్యాంకు ఈసారి ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది రెపోరేటును 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించారు. కేవలం రెపోరేటును తగ్గించడమే కాకుండా క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్)ను కూడా 100 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో ఈ రేటు ప్రస్తుతం 3 శాతానికి పడిపోయింది.

అంతే కాకుండా రానున్న రోజుల్లో బ్యాంకులకు రూ. 2.5 లక్షల కోట్ల నిధులను అందజేయనున్నట్టు కూడా సంజయ్ మల్హోత్ర ప్రకటించారు. మానిటరీ పాలసీ తన స్టాన్స్‌ను అకామిడేటివ్ నుంచి న్యూట్రల్‌కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంచనాలను 4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గిస్తూ అంచనా వేసింది. ఇక జీడీపీ వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది.