07-06-2025 12:00:00 AM
రెపోరేటు 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపు
ముంబై, జూన్ 6: మధ్యతరగతి వేతన జీవులకు ఆర్బీఐ భారీ ఊరటనిచ్చింది. మానిటరీ పాలసీ రెపోరేట్ను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించినట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర శుక్రవారం వెల్లడించారు. ఈ తగ్గింపుతో 6 శాతంగా ఉన్న రెపోరేటు కాస్త 5.50 శాతానికి దిగి వచ్చింది. ఆర్బీఐ రెపోరేటును తగ్గించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.
గత రెండు పర్యాయాల్లో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన సెంట్రల్ బ్యాంకు ఈసారి ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది రెపోరేటును 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించారు. కేవలం రెపోరేటును తగ్గించడమే కాకుండా క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ను కూడా 100 బేసిస్ పాయింట్లు తగ్గించారు. దీంతో ఈ రేటు ప్రస్తుతం 3 శాతానికి పడిపోయింది.
అంతే కాకుండా రానున్న రోజుల్లో బ్యాంకులకు రూ. 2.5 లక్షల కోట్ల నిధులను అందజేయనున్నట్టు కూడా సంజయ్ మల్హోత్ర ప్రకటించారు. మానిటరీ పాలసీ తన స్టాన్స్ను అకామిడేటివ్ నుంచి న్యూట్రల్కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం అంచనాలను 4 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గిస్తూ అంచనా వేసింది. ఇక జీడీపీ వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది.