12-06-2025 07:07:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): వర్షాకాలం ముందు నాళాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్(Additional Collector Faizan Ahmed) అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నిర్మల్ పట్టణంలోని జౌలీ నాళ, చైన్ గేట్ నాళ, దివ్యనగర్ పార్క్, రాంజీ గోండు విగ్రహ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... వరద నీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా నాళాల్లో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించాలని సూచించారు.
ప్రజలు నాళాల్లో చెత్త వేయకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి వర్షాకాలానికి ముందు నాళాల శుభ్రతను క్రమం తప్పకుండా నిర్వహిస్తే, వరదల సమస్య తలెత్తదని చెప్పారు. పట్టణంలోని పార్కులను శుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, పార్కులకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, అధికారులు హరి భువన్, దేవదాస్, తదితరులు పాల్గొన్నారు.