ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
జెడ్పీ సీఈవో పురుషోత్తం
మరిపెడ (మహబూబాబాద్) మే 29 (విజయక్రాంతి): మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి గృహప్రవేశాలకు సిద్ధం కావాలని జెడ్పీ సీఈవో డీ. పురుషోత్తం అన్నారు. శుక్రవారం మరిపెడ మండలంలోని ఆనెపురం, ఎల్లంపేట, మరిపెడ మున్సిపాలిటీ 15వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీఓ బి. వేణుగోపాల్ రెడ్డితో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తోందని, అందుకు అనుగుణంగా లబ్ధిదారులు కూడా తమ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ప్రత్యేక నమూనా ప్రకారం మూడు రంగుల పెయింటింగ్ తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ గోపి, ఉషా కీర్తి, పంచాయతీ కార్యదర్శులు మంజుల, సంబంధిత సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






